Home » Articles » మహాశివరాత్రి వైశిష్ట్యం

 

మహాశివరాత్రి వైశిష్ట్యం

 

 

 

 

పరమశివుడు మాఘకృష్ణ చతుర్దశి నాడు నిశీది సమయంలో కోటిసూర్యుల కాంతితో శివలింగ రూపంలో ఆవిర్భవించాడు. ఈ రాత్రి శివునికి చాలా ప్రియమైన రాత్రి. శివలింగాలన్నీ శివతేజస్సుతో ప్రకాశిస్తాయి. ఈ రోజునే మహాశివరాత్రి అంటారు.

 

 

 

శివరాత్రి వ్రతం సర్వపాపాలను హరింపచేసి

 

సర్వులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది

 

 

 

శివరాత్రి వ్రతం తనకెంతో ప్రియమైనదని, ఈ వ్రతం సర్వయజ్ఞ సమానమని, ఉత్తమోత్తమైన ఈ వ్రతంను ఒక్కసారి చేసినవారు ముక్తిని పొందుతారని పరమశివుడు పార్వతిదేవికి చెప్పినట్లుగా లింగపురాణం తెలియజేస్తుంది. అందుకే పెద్దలు జన్మానికో శివరాత్రి అని అంటారు.

 

 

నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి,

 

మహా శివరాత్రి

 

 

 

నిత్యశివరాత్రి :- ప్రతి దినమూ రాత్రి శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి.
పక్షశివరాత్రి :- ప్రతి నెలా చతుర్ధశిన ఉపవాసముండి రాత్రి శివుడిని ఆరాధించడం.
మాసశివరాత్రి :- ప్రతి నెలా కృష్ణ చతుర్ధశిన నియమనిష్టలతో శివారాధన చేయడం.
మహాశివరాత్రి :- మాఘమాస బహుళ చతుర్ధశిన పరమేశ్వరుణ్ణి భక్తిప్రపత్తులతో శాస్త్రబద్ధంగా ఆరాదించడం.
నిత్య, పక్ష, మాస శివరాత్రులను ఆచరించకపోయినా మహా శివరాత్రిని ఆచరించిన చాలు, అనంతమైన పుణ్యం లభిస్తుందని, ముక్తి ప్రాప్తమౌతుందని స్కాంద, శివ పురాణంలందు వివరింపబడింది.

 

 

 

పూర్వం సృష్టికర్త బ్రహ్మదేవుడికి, విష్ణువుకు మధ్య తమలో ఎవరు గొప్పవారనే బేధభావం వచ్చి వాదులాడుకొని శివుడిని చెప్పమని అడగగా వారి తగవు తీర్చేందుకై శివుడు వారిద్దరి మధ్య అనలస్తంభంగా ఆవిర్భవించాడు. తన ఆది అంతాలను ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని శివుడు చెప్పగా శివుని ఆది అంతాలను కనుగొనేందకు బ్రహ్మదేవుడు హంసరూపంలో ఆకాశంవైపు, మహావిష్ణువు వరాహరూపంలో పాతాళానికి వెళ్ళారు. ఎంత దూరం పయనించి వెదికినా వారు శివుని ఆది అంతమలు కనుగొనలేక శివుని దగ్గరకు వచ్చి ప్రార్ధించగా వారిద్దరి మధ్య లింగరూపంలో ఆవిర్భవించాడు. ఈ విధంగా ప్రత్యక్షమైన మూర్తే లింగోద్భవమూర్తి. ఈ లింగోద్భవం రాత్రిపూట జరిగింది. అందుచే మహాశివరాత్రి పగలంతా ఉపవాసం (ఉపవాసమనగా దైవమందు వసించడం. అంటే త్రికరణశుద్ధిగా శివున్నే ధ్యానిస్తూ, శివనామాన్నే స్మరిస్తూ, శివునియందే లగ్నమై ఉండడం) ఉండి రాత్రిపూట శివాభిషేకాలు, శివస్మరణం చేస్తూ, శివగాధలు వింటూ జాగరణ చేయమని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

 

 రాత్రి నాలుగు ఝాముల్లో నాలుగు విధాలుగా

 

అభిషేకాలు

 

 

 

మహాశివరాత్రిన అభిషేకాలు, పూజలు రాత్రియందే చేయడం ఎంతో శ్రేయష్కరం. రాత్రి నాలుగు ఝాముల్లో నాలుగు విధములుగా ఈ అభిషేకాలు చేయాలన్నది శాస్త్రవచనం :

మొదటి ఝామున శివునికి క్షీరంతో అభిషేకించి, పద్మాలతో పూజ చేస్తూ పులగము(బియ్యం పెసరపప్పు కలిపి వండినది)ను నైవేద్యంగా సమర్పిస్తూ ఋగ్వేద మంత్రాలను చదవాలి.

రెండవ ఝామున పెరుగుతో అభిషేకించి, తులసీదళంలతో పూజిస్తూ పాయసంను నైవేద్యంగా సమర్పిస్తూ యజుర్వేద మంత్రాలను చదవాలి.

మూడవ ఝామున నెయ్యితో అభిషేకించి, మారేడుదళంలతో పూజ చేస్తూ నువ్వులతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పిస్తూ సామవేద మంత్రాలను చదవాలి.

నాల్గవ ఝామున తేనెతో అభిషేకించి, తుమ్మిపూలతో పూజించి అన్నమును నైవేద్యంగా సమర్పిస్తూ అధర్వ మంత్రాలను చదవాలి.

ఇవేవి చేయకపోయినను శివుడు అభిషేకప్రియుడు (అలంకార ప్రియో విష్ణు:, అభిషేక శివః) కావున శివలింగంపై శివరాత్రినాడు నీటిని పోసి మారేడుదళంలను సమర్పించిన విశేషమైన పుణ్యం లభిస్తుందని లింగపురాణం తెలుపుతుంది.

 

సూర్యప్రదీప్

suryapradeephyd@gmail.com