Home » Articles » పిల్లలకు మరింత చేరువవుతున్న తండ్రులు

 

పిల్లలకు మరింత చేరువవుతున్న తండ్రులు

 



గతంలో కంటే ప్రస్తుత రోజుల్లో తండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పిల్లల మనసులకు చేరువవుతున్నారు. దీనికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. 80 దశకం నుంచి భారతదేశంలో చిన్న కుటుంబాలు పెరగటంతో, ఏర్పడిన మార్పుల కారణంగా తండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం పెరిగిందని చెప్పవచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇంట్లో వుండే పెద్దలు, లేదా ఖాళీగా వున్న పిల్లలతో చిన్నారుల ఆలనా పాలనా సాగిపోయేది. ప్రత్యేకంగా తండ్రి సంరక్షణలో వుండటం, లేదా ఎక్కువ సమయం గడిపే అవకాశం తక్కువ. కుటుంబ అవసరాలు తీర్చడానికి కావలసిన సంపాదనే లక్ష్యంగా సాగే వారు నాటి తండ్రులు. కుటుంబంలో ఆడవారు సంపాదించే వీలు అప్పటి సమాజంలో లేనందున స్త్రీలు ఇంటి పనులకు మాత్రమే పరిమితమయ్యేవారు. పిల్లలకు అందుబాటులో అమ్మ మాత్రమే వుండటం తండ్రిని చుట్టపు చూపుగా, రోజులో ఒకటి రెండు సార్లు పలకరింపుతో సరిపుచ్చుకునేవారు పిల్లలు. 1960 నుంచి వేగంగా చోటుచేసుకున్న పారిశ్రామికీకరణ, పెరిగిన విద్యా, ఉద్యోగవకాశాలు కుటుంబ వాతావరణం మీద ఎంతో ప్రభావం చూపించాయి. కుటుంబంలో తండ్రి మాత్రమే సంపాదిస్తే అవసరాలు తీరని స్థితి నెలకొనటంతో తల్లులు కూడా  బయటకు వచ్చి పని చేయటం  ఎక్కువయింది. ఈ క్రమంలో తల్లితండ్రులు పిల్లలకు దూరమయ్యారనటం కన్నా ఎక్కువ చేరువయ్యారనే చెప్పాలి.

 


ముందు జనరేషన్ల వారితో పోల్చుకుంటే నేటి తరం పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా తండ్రులు పిల్లలతో గడిపే సమయం గతం కన్నా ఎక్కువ అని వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి.  చిన్నప్పుడు వారి తల్లిదండ్రులు తమతో గడిపిన సమయంతో పోలిస్తే, తల్లిదండ్రులుగా తమ పిల్లలతో నేటి పేరెంట్స్ ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సర్వేలు తెలియచేస్తున్నాయి. 80, 90 దశకాల్లో ఉద్యోగినులైన తల్లులు ఫ్యామిలీ, జాబ్ రెండింటినీ బ్యాలెన్సు చేస్తు పిల్లలను చూసుకోవలసి వచ్చేది. ఈ విషయంలో నేటి తరం తండ్రుల దృక్పథం ఎంతో మారింది. పిల్లల డేకేర్, ఆరోగ్యం, చదువు, ఆటపాటలు, ఔటింగ్ ఇలా ప్రతి విషయంలో తల్లితో పాటు తండ్రులు కూడా బాధ్యత తీసుకుంటున్నారు. రౌండ్ ద క్లాక్ పిల్లలకు అమ్మ మాత్రమే అందుబాటులో వుండే తీరు ఇప్పుడు పూర్తిగా మారింది. పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యత అనే అవగాహన నేటి తరం తండ్రి పూర్తిగా గ్రహించి, పాటిస్తున్న విషయం ఆనందకరం. ఏమైనా నేటి పిల్లలు ఈ విషయంలో అదృష్టవంతులనే చెప్పాలి.