దేవీ నవరాత్రులు
నవరాత్రులు అన్నా, అమ్మవారి పూజలన్నా ప్రధానంగా చేసేది లలితా రహస్య నామ సహస్ర పారాయణం. కుంకుమార్చన చేసినా సహస్ర నామాలతోనే చేస్తూ ఉంటారు జగదంబ లలితాదేవిగా ఆవిర్భవించిన ఇతివృత్తం బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానంలో వివరించబడింది. సతీదేవి వియోగంతో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు యోగాగ్నిలో శరీరం విడిచిన సతీదేవి భర్త మీద ఉండే ప్రమతో హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా జన్మించింది. జగన్మాతని కుమార్తెగా పొందాలన్న మేనాదేవి కోరిక కూడా తీరింది. యుక్తవయస్సు వచ్చాక శివుని వివాహమాదాలని నిశ్చయించుకొన్నది. నారదుడి ఉపదేశంతో హిమవంతుడు పార్వతిని శివునికి సేవలు చేయడానికి నియోగిస్తాడు. అదే సమయంలో దేవతలు తారకాసుర సంహారానికి తమకు తగిన సేనానాయకుడు రుద్రుని కుమారుడే కావాలి కనుక తపోనిష్ఠలో ఉన్న శివుని బహిర్ముఖుని చేయటానికి మన్మథుని సహాయం కోరారు. అతడు తన పరివారాన్ని వెంట పెట్టుకొని హిమాలయాలకు చేరాడు. పార్వతి, శివుని పాదాల వద్ద పూలను సమర్పించటానికి వంగిన సమయంలో, అదే తగిన సమయమని తలచి మన్మథుడు తన పూల బాణం వేశాడు. శివుని మనస్సు ఒక్కసారి చంద్రోదయ సమయంలో ఉప్పొంగిన సముద్రంగాలా కల్లోలమవటంతో కారణ మేమిటా అని కన్ను తెరిచాడు. ఎదురుగా మన్మథుడు కనపడ్డాడు. శివుని చూపు పడిన మరుక్షణం మన్మథుడు సాకార భస్మమయ్యాడు. పార్వతీదేవి సపర్యలతో శివుడి అనుగ్రహం పొందటం కష్టమని నిశ్చయించుకుని, తానూ తపోదీక్ష వహించి శివుని చేపట్టింది.
మన్మథుని శరీరం కాలిపోయి బూడిదరాసిని చూసి, గణేశుడనే విశ్వకర్మ శిష్యుడు మంచి మూల పదార్ధం దొరికిందని ముచ్చటపడి దానితో ఒక ఆకారాన్ని తయారు చేశాడు. బ్రహ్మ దానికి ప్రాణం పోశాడు. కాలిపోయిన నిర్జీవ పదార్ధం నుండి తయారీ చేయబడిన రూపం కనుక వాడిలో చైతన్యం లేదు. వాడి లక్షణాన్ని బట్టి వాడిని 'భండ' అని పిలిచారు. భండ అంటే తెలుగులో మనం అనుకునే బండ అనే అర్థం. మొద్దు స్వరూపం సున్నితత్వం మొదలైనా గుణాలుండవు. వాడి పెద్ద ఆకారాన్ని గుణాలని చూసి రాక్షసులు వాడిని తమ రాజుగా చేసుకున్నారు. వాడి రాజధాని శూన్యక నగరం. వాడి సోదరులు విశుక్రుడు, విషంగుడు. చెడ్డవారితో కలిసి ఉండే లక్షణానికి విషంగుడు, స్త్రీలోలుపతికి విశుక్రుడు ప్రాతినిథ్యం వహిస్తారు. భండాసురుడికి ముప్పది మంది కుమారులు. మంత్రులు సేనానులు సేవిస్తూ ఉండగా మదించిన వాడి స్వర్గం మీదకి దండెత్తి దేవతలను వెడలగొట్టాడు. దేవతలు, మహర్షులు, మునులు వాడు పెట్టె బాధలను భరించలేకపోయారు.
అప్పుడు వారందరూ కలిసి చిద్యాగం చేయగా చిదగ్ని కుండలో నుండి దేవకార్యం తీర్చటానికి సంసిద్ధమై ఉదయుస్తున్న కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ దేవి ఆవిర్భవించింది. సౌదర్య పరమావధి అయిన ఆ తల్లి ఆవిర్భవించిన వెంటనే రాక్షస సంహారానికి బయల్దేరింది. ముందుగా తన మంత్రులను, సేనా నాయకులను పంపింది. వారు భండుని మంత్రులతోను, సేనానులతోను పోరి మట్టుపెట్టారు. అతడి కుమారులను చంపటానికి బాలను కల్పన చేసింది. సర్వవిఘ్న యంత్రాన్ని యుద్ధభూమిలో నిలిపాడు భండుడు. దానిని నిర్వీర్యం చేయటానికి కామేశ్వేరుని ముఖం ఆలోకిస్తూ గణేశుని కల్పించింది. తొమ్మిదవ నాడు తానే స్వయంగా వాడితో యుద్ధం చేసి, మహా కామేశ్వరాస్త్రంతో శూన్యక నగరంతో పాటుగా భండాసురుని సమూలంగా దహించింది. వశిన్యాది వాగ్దేవతలామెను పట్టాభిషిక్తురాలుగా చేసిన సందర్భంలో ఆమె గుణగణాలను, సౌదర్యాన్ని కీర్తించారు. అదే లిలితారహస్య నామ సాహస్రం.
ఆమె సర్వచైతన్య స్వరూపిణి కనుక ఆమెను 'లలిత' అని పిలిచారు. తమను కన్నతల్లిలాగా భావించి శ్రీమాతా! అని సంబోధించారు. జీవితం అంతే సుఖపడటం, సుఖపడటం అంటే తినటం, నిద్రపోవటం మాత్రమే అని భావించటమే బండతనం. అటువంటి వారికి ఉండేది శూన్యమే కదా! బండతనం పోవాలంటే తగిన మార్గం ఒక్కటే. అది చైతన్యవంతులు కావటమే. అందుకే జగదంబ భండాసురుని వధ చేయటానికి సర్వ చైతన్య స్వరూపిణిగా అవతరించింది. శరన్నవరాత్రులలో అమ్మ అవతాలలలో లలితాదేవి అవతారం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. నిజానికి శక్తి అన్నా చైతన్యమన్నా ఒకటిగానే భాసిస్తాయి. చైతన్యం లేనిదే శక్తి వ్యక్తం అయ్యే అవకాశం లేదు కదా! అందుకే లలితాదేవి చేతిలో ధరించిన ఆయుధాలు కూడా ఆ విషయాన్నే నిరూపిస్తాయి. రాగము (అంతులేని ఇష్టం) అనే పాశాన్ని, క్రోధము అనే అంకుశాన్ని, మనస్సు అనే విల్లుని పంచన్మాత్రలు అనే బాణాలని ధరించి ఉంటుంది. ఇవి మొద్దుబారిన మనస్సుని చైతన్యవంతం చేస్తాయి కదా!
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
సమస్తస్త్యై సమస్తస్త్యై సమస్తస్త్యై నమో నమః
- డా. అనంతలక్ష్మీ