|
|

తిరుమలలో ఈ నెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఆ రోజు దీపావళి పర్వదినం కావడంతో శ్రీవారి ఆయలంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. ఆ కారణంగానే దీపావళి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆస్థానం సందర్భంగా స్వయంగా ఆలయానికి వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో వెల్లడించింది. అలాగే సిఫారసు లేఖలను కూడా స్వీకరించోమని పేర్కొంది.
ఇక పవిత్ర కార్తీక మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను కూడా టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది. తిరుమలలో నవంబరు 1న కేదారగౌరీ వ్రతం నిర్వహించనున్నారు. అలాగే నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర నిర్వహిస్తారు. అలాగే 5న నాగుల చవితి వేడుకలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా పెద్ద శేష వాహనసేవ ఉంటుంది. ఇక 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు. నవంబర్ 9వ తేదీన శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర నిర్వహిస్తారు. 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 12న ప్రబోధన ఏకాదశి ఉంటుంది. నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి ఉంటుంది. నవంబరు 15న కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తారు. నవంబర్ 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి వేడుకలు ఉంటాయని టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది.