మెనోపాజ్ దశలో మహిళలకు గుండెజబ్బుల ముప్పు ఎక్కువా? వైద్యులు చెప్పిన అసలు విషయాలు ఇవీ! మహిళల జీవితంలో  ఆరోగ్య పరంగా అనేక సవాళ్లు ఉంటాయి. ప్రతి దశలో విభిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. నెలసరి, గర్భం, ప్రసవం, తదుపరి ఎదురయ్యే దశ మెనోపాజ్.  ఈ మెనోపాజ్ తోనే మహిళల నెలసరి చక్రం ముగుస్తుంది. అయితే మెనోపాజ్ వల్ల మహిళలలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందా? అంటే అవునంటున్నారు వైద్యులు. సాధారణంగా చాలా మంది మహిళల్లో 40ల మధ్య నుండి 50ల మధ్య వరకు మెనోపాజ్  సంభవిస్తుంది. ఈ దశలో, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిలో తగ్గుదలతో స్త్రీ శరీరంలో ప్రధాన హార్మోన్ల మార్పులు జరుగుతాయి. గుండె జబ్బుల నుండి స్త్రీలను రక్షించడంలో ఈస్ట్రోజెన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలలో ఎర్రబడిన కణాలను తొలగించడంలో శరీరానికి సహాయం చేయడం ద్వారా అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  ఈ సమస్యలో ఫలకాలు ఏర్పడి అడ్డంకిని కలిగిస్తుంది. ఇంకా ఈస్ట్రోజెన్ ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించడం ద్వారా రక్తపు లిపిడ్ స్థాయిలపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలు పెంచుతుంది. తత్ఫలితంగా, రుతువిరతి తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వలన అనేక గుండె జబ్బులలో కీలకమైన అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధి చెంది  గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మెనోపాజ్ అనేది మహిళలలో గుండె జబ్బులకు ఎక్కువ ఆస్కారం ఇచ్చే దశగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ దశలో మహిళలు 7 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల నుండి జాగ్రత్త పడవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం..  పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారం గుండెకు మంచిది. సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ (క్రీమ్, వెన్న, రెడ్ మీట్), సోడియం (ఉప్పు జోడించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు), జోడించిన చక్కెరలను తీసుకోవడం పరిమితం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ..  వ్యాయామం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.  మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెద్దలు శారీరక శ్రమ కోసం ప్రతి వారం కనీసం 150 నిమిషాల  తక్కువ నుండి ఎక్కువ తీవ్రత కలిగిన ఏరోబిక్ వ్యాయామం లేదా 75 నిమిషాల  కఠిన వ్యాయామాల నుండి ఏరోబిక్ వ్యాయామంలో పాల్గొనవచ్చు.  వీటిలో వారంలో రెండు రోజులైనా శరీర కండరాలను బలపరిచే వ్యాయామాలు తప్పనిసరిగా ఉండాలి. బరువు.. మెనోపాజ్ తర్వాత నెమ్మదిగా జీవక్రియ తగ్గుతుంది. శరీర కూర్పులో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణం. ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బులకు దోహదం చేస్తుంది. ధ్యానం, యోగా ఒత్తిడి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ధూమపానం.. ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం మానేయడం మీ ప్రస్తుత వయస్సుతో సంబంధం లేకుండా  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెగ్యులర్ హెల్త్ చెకప్ లు.. రెగ్యులర్ చెక్-అప్‌లు ఆరోగ్య సమస్యలను డీల్ చేయడం సులభతరం చేస్తాయి.  ప్రాథమిక దశలోనే సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. గుండె జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, మధుమేహం వంటి పరిస్థితులను పర్యవేక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి. హార్మోన్ థెరపీ.. హార్మోన్ థెరపీ అనేది మహిళ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే రుతుక్రమం ఆగిన లక్షణాలను డీల్ చేయడంలో సహాయపడుతుంది. గుండె ప్రమాదం విషయంలో కొంతమంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  వైద్యులను  సంప్రదించి హార్మోన్ థెరపీపై నిర్ణయం తీసుకోవాలి.                            *నిశ్శబ్ద.  

  హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే!   ఎక్కువశాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ రక్తహీనత. సాధారణంగా 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్దతులు పాటిస్తే మంచిది. మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే  చాలు, ఎలాంటి సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది కాని టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో  కాస్తంత జాగ్రత్త పాటింఛి దానిని పెంచుకోవటం  మంచిది  కదా. ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటివాళ్ళు ఎక్కువగా పాలకూర, మెంతికూర, పెసరపప్పు, రాజ్మా, బీన్స్ మొదలయినవి తినాలి. నువ్వులు,బార్లి, బాదం పప్పు  తినటం కూడా మంచిది. మాంసాహారులు ఎర్ర మాంసం, చేపలు తింటే మంచిది.   అదేగనక ఒంట్లో విటమిన్ సి తక్కువగా ఉండి దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గుతున్నట్లయితే అలాంటి వాళ్ళు జామకాయలు, బొప్పాయి, కివి పండు, కమలాపండు, ద్రాక్ష తీసుకోవాలి. అదే కూరగాయల్లో అయితే కాప్సికమ్, క్యాబేజ్, టమాటా  ఇలాంటివి ఎక్కువగా తినాలి. బాదం పప్పు రక్తాన్ని పెంచటంలో ఎక్కువ దోహదపడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లు రోజుకి 10 లేక 12 బాదం పప్పులు నానబెట్టుకుని తినాలి. బీట్రూట్ రక్తహీనతకు తిరుగులేని మందు. ఉదయం పూట ఒక గ్లాస్ పచ్చి బీట్రూట్ జ్యూస్ , 20 రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్, పాస్తా, కార్న్ ఫ్లాక్స్ కూడా రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ఇవన్ని ఉండేటట్లు చూసుకుంటే చాలు హిమోగ్లోబిన్ పెరగటానికి టాబ్లెట్స్ మీద ఆధారపడాల్సిన పని ఉండదు.   ..కళ్యాణి

మహిళలకు అసలు పొట్ట ఎందుకు వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే..!  అందరూ సాధారణంగా పిలుచుకునే బెల్లీ ఫ్యాట్ చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ ఇది మహిళలను చాలా ఇబ్బంది పెడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడమే బెల్లీ ఫ్యాట్ గా పిలవబడుతుంది. అయితే ఈ పొట్ట భాగంలో కొవ్వు వచ్చినంత వేగంగా తగ్గదు. పొట్ట వచ్చిందంటే చాలామందిలో కామన్ గా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా సులువుగా వచ్చేస్తాయి. మగవాళ్లకు పొట్ట వస్తే సరదాగా నాలుగు జోకులు వేసుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ మహిళలు  దీన్ని అంత సరదాగా తీసుకోలేరు. పైగా ఇంట్లోనే వారిమీద చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదురవుతాయి.  అసలు ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. మహిళలో  పొట్ట కొవ్వు పేరుకుని పోవడానికి కారణం శరీరంలో హార్మోన్ల స్థితిలో మార్పు.  జీర్ణాశయ పనితీరు తగ్గడం, జీవక్రియ రేటు దారుణంగా పడిపోవడం వల్ల పొట్ట  భాగంలో కొవ్వు పేరుకుని పోతుంది. ఈిస్టోజెన్ స్థాయిలు పెరిగి పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుని పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి  పొట్ట పడుతుంది. ఇది చాలా సాధారణమైన విషయమే అయినా దాన్ని  ఎలా తగ్గించుకోవాలో చాలామందికి తెలియదు. ఈ పొట్ట కొవ్వుకు కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే.. ఆహారం.. సరైన ఆహారం తీసుకోకపోతే పొట్ట కొవ్వు పెరుగుతుంది. తీసుకునే చాలా ఆహారాలలో కొవ్వులు ఉంటాయి. శారీరక శ్రమకు మించి కొవ్వు పదార్థాలు తీసుకుంటే అవి పొట్ట రావడానికి కారణం అవుతాయి. జంక్ ఫుడ్, కోక్, కూల్ డ్రింక్స్, మైదా, బేకరీ ఐటమ్స్, కృత్రిమ జ్యూసులు చాలా ఈజీగా పొట్టకు కారణం అవుతాయి. పొట్ట తగ్గించాలని అనుకుంటే మొదట వీటన్నింటిని  వదిలెయ్యాలి. గర్భం దాల్చడం.. గర్భం దాల్చిన  మహిళలలో చాలామందికి  బిడ్డను మోయడం వల్ల  పొట్ట సాగుతుంది. ప్రసవం తరువాత  ఈ పొట్ట సెట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొందరు మహిళలు వ్యాయామాలు, యోగా చేయడం ద్వారా తొందరలోనే దీన్ని సెట్ చేసుకుంటారు. కానీ  ప్రసవం తరువాత బిడ్డ సంరక్షణ, శరీరం చురుగ్గా లేకపోవడం వల్ల వ్యాయామం చేయకుండా ఉంటారు. దీని కారణంగా పొట్ట కొవ్వు పేరుకుపోతుంది. పిండి పదార్థాలు.. ప్రతి ఒక్కరూ బరువు పెరగడానికి ప్రధాన కారణం పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగానూ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానూ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. శరీరంలోకి వెళ్లే కేలరీల కంటే శరారీక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు తక్కువగా ఉంటే అవి కొవ్వుగా రూపాంతరం చెంది బరువు పెరుగుతారు.  ఈ కొవ్వు ఎక్కువగా శరీరంలో పొట్ట భాగంలోనే పేరుకుపోతుంది కాబట్టి ఇది బెల్లీ ఫ్యాట్ కు కారణం అవుతుంది. దీన్ని తగ్గించాలంటే కార్బోహై్డ్రేట్లు తక్కువ తీసుకోవాలి. శారీరక శ్రమ ద్వారా ఖర్చయ్యే కేలరీలకు సరిపడా కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. పరిష్కారం.. పొట్ట తగ్గడానికి ముఖ్యంగా ఆహారం నియంత్రణతో పాటు వర్కౌట్లు కూడా చేయాలి. వాకింగ్, బ్రిస్క్ వాక్, యోగా, సూర్యనమస్కారాలు,  పొట్ట తగ్గడానికి నిర్దేశించిన వ్యాయామాలు చేయాలి.   ఆహారాన్ని ఒకే సారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. ముఖ్యంగా సిట్టింగ్ వర్క్ చేసేవారు ఆహారాన్ని చాలా మితంగా తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్ గల ఆహారాన్ని , నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సిట్టింగ్ వర్క్ లో ఉన్నవారు ప్రతి గంటకు ఒకసారి ఓ 5 నిమిషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.                                                    *నిశ్శబ్ద.

పిల్లలు పుట్టడంలో ఇబ్బందులా? ఈ ఆహారాలు తీసుకుంటే సెట్..! ఒకప్పటితో పోలిస్తే ఇప్పట్లో పిల్లలు పుట్టడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది. మగవారిలో కూడా ఈ లోపం ఉన్నప్పటికీ ఎక్కువశాతం ఆడవారిలో కనిపిస్తుంది. మహిళలల్లో గర్భాశయ సమస్యలు, నెలసరి సరిగా రాకపోవడం, హార్మోన్ సమస్యలు మొదలైనవి పిల్లలు పుట్టడంలో ఇబ్బందులకు కారణం అవుతాయి. అయితే పోషకాహారం తీసుకోకపోవడం కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం అని ఆహార నిపుణులు అంటున్నారు.  పిల్లలు పుట్టడంలో  లోపాలను, హార్మోన్ సమస్యలను అధిగమించడానికి  కొన్ని ఆహారాలు బాగా సహకరిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ఫ్యాటీ ఫిష్.. చేపలలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. రుతుచక్రాన్ని నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. ఆకుకూరలు.. పాలకూర, బచ్చలికూర, కాలే, తోటకూర మొదలైన ఆకుకూరలలో ఫోలెట్ అధికంగా ఉంటుంది. ఇది పిండం డవలప్ కావడానికి ఎంతో ముఖ్యమైనది. సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. బెర్రీస్.. బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నిరోధిస్తాయి. ఈ ఫ్రీరాడికల్స్ బారి నుండి అండాలను, స్పెర్మ్ ను రక్షించడంలో సహాయపడతాయి. అవకాడో.. అవకాడో ఖరీదైన పండే అయినప్పటికీ వీటిలో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా విటమిన్-ఇ, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి  సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. సీడ్స్, నట్స్.. బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ మొదలైన వాటిలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం. తృణధాన్యాలు.. క్వినోవా, బ్రౌన్ రైస్, గోధుమలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అవసరమైన పోషకాలు అన్నీ తృణధాన్యాలలో లబిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. లీన్ ప్రోటీన్లు.. లీన్ మాంసాలు, పాలు పాల ఉత్పత్తులు, చికెన్, చేపలు, చిక్కుళ్లు వంటివి తీసుకోవాలి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి, మొత్తం పునర్ఫత్తి ఆరోగ్యానకి కూడా చాలా మంచి ప్రోటీన్ ను అందిస్తాయి. డైరీ ఆహారాలు.. పాలు, పాల ఉత్పత్తులలో విటమిన్-డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. సంతానోత్పత్తి ఆరోగ్యంలో సానుకూల ఫలితాలు ఇస్తాయి. రంగురంగుల కూరగాయలు.. కేవలం సంతానోత్పత్తికే కాదు.. సాధారణంగా కూడా ఆరోగ్యం బాగుండాలంటే రంగు రంగుల కూరగాయలు తీసుకోవడం చాలా ముఖ్యం. బెల్ పెప్పర్స్, క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అండాలు, స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. దీని వల్ల సంతానోత్పత్తిలో మెరుగైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడతాయి.                                       *నిశ్శబ్ద.  

మహిళలు సిజేరియన్ తరువాత ఇవి తింటే తొందరగా కోలుకుంటారు! గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం ప్రతి మహిళ జీవితంలో చాలా అపురూపమైన విషయం. ఒకప్పుడు పూర్తీగా నార్మలో డెలివరీలు ఉండేవి. కానీ  నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డను కనడానికి కష్టమైనప్పుడు వైద్యులు సిజేరియన్ చేసేవారు. ఇప్పుడైతే అసలు నార్మల్ డెలివరీలు తక్కువైపోయి సిజేరియన్  ఎక్కువైంది. నార్మల్ డెలివరీలో నొప్పులు భరించలేక కొందరు సిజేరియన్ చేయించుకుంటే.. అరుదైన తేదీలు, మంచి ముహూర్తాలు చూసి మరికొందరు సిజేరియన్ ద్వారా బిడ్డను కంటున్నారు. ఏది ఏమైనా సిజేరియన్ లు ఎక్కువైన ఈ కాలంలో మహిళలు సిజేరియన్ కుట్లు, శరీరంలో కలిగే ఇబ్బందుల నుండి తొందరగా కోలుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బాలింతలు తప్పక తినాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. ప్రసవం తరువాత, కుట్ల కారణంగా బలహీనంగానూ, నొప్పులకు లోనైన కండరాలు త్వరగా కోలుకోవడానికి ప్రోటీన్ బాగా సహాయపడుతుంది.  బీన్స్, నట్స్, గుడ్లు ప్రోటన్ కోసం కొన్ని ఉదాహరణలు. గర్భం మోయడమనే కారణంగా మహిళలలో ఎముకలు ఒత్తిడికి లోనై  ఉంటాయి. అందుకే కాల్షియం మెండుగా ఉన్న ఆహారాలు తీసుకుంటే ఎముకలు బలంగా మారతాయి. కాల్షియం బాగా అందడానికి కాల్షియం, పాలు, బాదం, గుడ్లు, పనీర్ తీసుకోవాలి. సి సెక్షన్ అయినా, సాధారణ ప్రసవం అయినా బాలింతలు నీరు పుష్కలంగా తాగడం ఎంతో అవసరం. ఎందుకంటే తల్లిపాలు తగినంత ఉత్పత్తి కావాలంటే శరీరంలో తగినంత నీరు కూడా అవసరం. నీరు పుష్కలంగా తీసుకుంటే సి సెక్షన్ చేయించుకున్నవారు తొందరగా కోలుకునే అవకాశం ఉంది. శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో నీరు సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. గర్బం మోసిన సమయంలోనూ, ప్రసవం తరువాత వచ్చే మలబద్దకం సమస్యను చెక్ పెట్టడానికి ఫైబర్ సహాయపడుతుంది. ప్రసవం కారణంగా శరీరం కోల్పోయిన రక్తం తిరిగి ఉత్పత్తి కావడానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. ఖర్జూరం, బీట్రూట్, అంజీర్, ఆకుకూరలు, మునగ ఆకు వంటి వాటిలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ప్రసవం తరువాత పెద్దలు బాలింతలకు వెల్లుల్లి, సొంపు, దనియాలు వంటి వంటింటి  దినుసులను ఆహారంలో భాగం చేసేవారు. ఇవి పాల ఉత్పత్తిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరం తొందరగా రికవరీ కావడానికి కూడా సహాయపడతాయి. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి. విటమిన్-ఎ శరీరంలో కణాలను రిపేరీ చేయడంలో సహాయపడుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. క్యారెట్, పాలు, ఆకుకూరలలో విటమిన్-ఎ పొందవచ్చు. సిజేరియన్ చేయించుకున్న మహిళలలు తొందరగా కోలుకోవడానికి కాపర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.  చేపలు, గింజలు, ఎర్ర కందిపప్పు, గోధుమలు, వాల్నట్స్, వేరుశనగలు  మొదలైనవాటిలో  కాపర్ సంపూర్ణంగా ఉంటుంది.                                     *నిశ్శబ్ద  

మహిళల్లో అత్యంత ప్రాణాంతకర క్యాన్సర్ ఇదే.. దీని గురించి తప్పక తెలుసుకోవాలి! ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.  అన్ని రకాల క్యాన్సర్‌లతో ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు మహిళలను మాత్రమే ప్రభావితం చేస్తాయి.  గర్భాశయ క్యాన్సర్ అలాంటి తీవ్రమైన సమస్య.  2020లో గర్భాశయ క్యాన్సర్ 6.04 లక్షల కొత్త కేసులు,  3.42 లక్షల కంటే ఎక్కువ మరణాలు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్ . ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే ఈ ఆరోగ్య   సమస్య గురించి ప్రజల్లో అవగాహన పెంచడం,  నివారణ, స్క్రీనింగ్,  చికిత్స గురించి మహిళలకు అవగాహన కల్పించే లక్ష్యంతో జనవరి నెలను 'సర్వికల్ క్యాన్సర్ అవేర్‌నెస్ నెల'గా జరుపుకుంటారు. సర్వైకల్ క్యాన్సర్.. సర్వైకల్ క్యాన్సర్  గర్భాశయంలో వచ్చే క్యాన్సర్. ఇది యోనితో అనుసంధానించబడిన గర్భాశయం యొక్క దిగువ భాగం. ఈ క్యాన్సర్ తరచుగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.  దీని లక్షణాలను గుర్తించడం కష్టం. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) గర్భాశయ క్యాన్సర్  రావడానికి  అత్యధిక  కారణమవుతుంది. HPV అనేది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఒక సాధారణ అంటువ్యాది. శరీరం  రోగనిరోధక వ్యవస్థ HPV వైరస్‌ను నాశనం చేయగలిగినప్పటికీ తక్కువ శాతం మంది వ్యక్తులలో వైరస్ సంవత్సరాలు శరీరంలోనే ఉండి క్యాన్సర్‌కు కారణమవుతుంది. గర్భాశయ క్యాన్సర్  లక్షణాలు.. సాధారణంగా గర్భాశయ క్యాన్సర్  ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు, అందుకే దాని ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి, వీటి గురించి  శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. సంభోగం తర్వాత లేదా పీరియడ్స్ లేకపోయినా, లేదా  మెనోపాజ్ తర్వాత యోనిలో రక్తస్రావం. భారీ ఋతు రక్తస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ కాలం ఉండటం. యోని ద్వారం దుర్వాసన. సంభోగం సమయంలో పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఉంటుంది? ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని పరిస్థితులు ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.  ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నా. లైంగిక భాగస్వాములు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇది కాకుండా చిన్న వయస్సులో సెక్స్ చేయడం కూడా HPV ప్రమాదాన్ని పెంచుతుంది. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు) కూడా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.  రోగనిరోధక వ్యవస్థ మరొక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బలహీనపడి  HPV ఇన్ఫెక్షన్ వస్తే గర్భాశయ క్యాన్సర్‌ కు గురయ్యే అవకాశం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ధూమపానం చేసే  మహిళలకు HPV ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉండచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ను ఎలా నివారించాలి? కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సర్వైకల్‌ క్యాన్సర్‌ను అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం HPV వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. HPV సంక్రమణను నివారించడానికి టీకాలు వేయడం గర్భాశయ క్యాన్సర్,  ఇతర HPV సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. HPV వ్యాక్సిన్  సరైనదా, కాదా అని  వైద్యుడిని అడగి తీసుకోవాలి.  ఇది కాకుండా డాక్టర్ సలహాపై రెగ్యులర్  పరీక్ష చేయించుకోవాలి. పాప్ పరీక్ష గర్భాశయంలో క్యాన్సర్ పరిస్థితులను గుర్తించడంలో సహాయపడుతుంది.                                                        *నిశ్శబ్ద.

థైరాయిడ్ సమస్య ఉందా? ఈ ఆహారాలు అస్సలు తినకండి..! చాలామంది మహిళలు సరిగా తినకపోయినా సరే లావుగా కనిపిస్తుంటారు. డైటింగ్ ఫాలో అయినా బరువు విషయంలో మార్పు ఉండదు. ఇలాంటి వారిలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు అసమతుల్యంగా మారడం, శరీరంలో హార్మోన్లు హెచ్చుతగ్గులు కావడం వల్ల బరువు పెరుగుతారు. థైరాయిడ్ ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే థైరాయిడ్ సమస్య మరింత ఉదృతం అవుతుంది. థైరాయిడ్ ఉన్నవారు అస్సలు తినకూడని ఆహారాలేంటో.. ఆయుర్వేదం వీటిని ఎందుకు తినకూడదని చెప్పిందో తెలుసుకుంటే.. పీనట్ బటర్.. (వేరుశనగ వెన్న) పల్లీలు లేదా వేరుశనగలను గ్రైండ్ చేసి పీనట్ బటర్ తయారుచేస్తారు. వేరుశనగలలో ఉండే గాయిట్రేజెన్ కంటెంట్ కారంగా హైపోథైరాయిడిజం మరింత తీవ్రమవుతుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారు వేరుశనగ, వేరుశనగలతో తయారుచేసే పీనట్ బటర్ తినకూడదు. రాగులు.. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ రాగులు థైరాయిడ్ ఉన్నవారికి సమస్య పెంచుతాయి. రాగులు సాధారణ వ్యక్తులకు ఎంతో శక్తివంతమైన ధాన్యం.  వీటిలో కాల్షియం, ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. కానీ వీటిలో గోయిట్రోజెనిక్ ఉంటుంది. వీటిని తినాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. రాగులను బాగా నానబెట్టి, బాగా ఉడికించిన తరువాత నెలలో కెవలం రెండు మూడు సార్లు మాత్రమే తినవచ్చు. బాదం.. బాదంలో సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ థైరాయిడ్ పనితీరుకు మంచివి. అయితే బాదం కూడా గోయిట్రోజెనిక్ ఆహారం. బాదంను ఎక్కువగా తీసుకుంటే  థైరాయిడ్ సమస్యను తీవ్రతరం చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఎక్కువ పనిచేస్తే అయోడిన్ ను గ్రహించే సామర్థ్యంను తగ్గిస్తుంది. అందుకే థైరాయిడ్ ఉన్నవారు రోజుకు 3కు మించి బాదం పప్పులు తినకూడదు. సోయా.. సోయా ఆహారాలు కూడా థైరాయిడ్ లక్షణాలు ప్రభావితం చేస్తాయి.  థైరాయిడ్ గ్రందికి చికాకు కలిగించే గోయిట్రోజెన్లు సోయా ఉత్పత్తులలో ఉంటాయి. ఈ కారణంగా సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. గోధుమ.. థైరాయిడ్ ఉండి బాగా లావుగా ఉన్నవారు అన్నానికి బదులుగా చపాతీలు తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.  కానీ థైరాయిడ్ ఉన్నవారు గోధుమలు తినకూడదు. గోధుమలలో ఉండే గ్లూటటెన్ గోయిట్రోజెనిక్ సమ్మేళనం. ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడ్ ఉన్నవారు గోధుమలు చాలా తక్కువగా తీసుకోవాలి. గ్లూటెన్ రహిత ఆహారం తీసుకునే వ్యక్తులు థైరాయిడ్ గ్రంధిపై దాడిచేసి యాంటీబాడీలను రక్తంలో తక్కువగా కలిగి ఉంటారు.                                              *నిశ్శబ్ద.  

 పీరియడ్స్ టైంలో వచ్చే తలనొప్పి తగ్గాలంటే.. ఈ పనులు చేయండి! ప్రతి మహిళకు పీరియడ్స్ అనేది సాధారణ విషయం.  కొందరికి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి అస్సలు నొప్పి ఉండదని చెబుతుంటారు. కొందరికేమో నడుము, వెన్ను భాగంలో నొప్పి ఉంటుంది. మరికొందరికి పొత్తి కడుపు కండరాలు ఒకటే నొప్పి, తిమ్మిర్లు ఉంటాయి. కానీ చాలామంది బయటకు చెప్పని విషయం తలనొప్పి. మహిళలలో పీరియడ్స్ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఇవన్నీ వస్తాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే తలనొప్పికి పీరియడ్స్ కారణం అని చాలామందికి తెలియదు. ఈ సమయంలో వచ్చే తలనొప్పిని అధిగమించాలన్నా, పీరియడ్స్ ఇబ్బందులను అధిగమించాలన్నా ఈ కింది చిట్కాలు పాటించాలి. వేడి కాపడం.. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి అయినా తలనొప్పి అయినా తగ్గించుకోవడానికి వేడి కాపడం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తలనొప్పి తగ్గాలంటే వేడి కాపడం మెడ దగ్గర పెట్టాలి. ఇది  తలనొప్పిని, తల భారాన్ని తగ్గిస్తుంది. అల్లం టీ.. పీరియడ్స్ సమయంలో కలిగే ఇబ్బందులకు చెక్ పెట్టే మరొక చిట్కా అల్లం టీ. తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే అల్లాన్ని నీటిలో వేసి బాగా మరిగించి కాసింత తేనే, నిమ్మరసం కలిపి గోరువెచ్చగా తాగాలి. ఆయిల్స్.. నెలసరి సమయంలో వచ్చే తలనొప్పి తగ్గించడానికి ఎసెంటియల్ ఆయిల్స్ కూడా బాగా సహాయపడాయి. లావెండర్, పిప్పరమెంట్, చామంతి వంటి నూనెలను  సాధారణ నూనెలో కలిపి తలకు రాసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం ఉంటుంది. వీటి వాసన వల్ల మానసికి స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఆకుకూరలు.. పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం తలనొప్పిని కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. గింజలు, విత్తనాలు.. బాదం, జీడిపప్పు, హాజెల్ నట్స్, బ్రెజిల్ నట్స్ తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలను రిలాక్స్ గా ఉంచుతుంది. మరీ ముఖ్యంగా వీటిలో ఉండే విటమిన్-ఇ మైగ్రేన్ నొప్పిని కంట్రోల్ చేస్తుంది. చేపలు.. సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా-3 ప్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తలనొప్పిని తగ్గిస్తాయి. పండ్లు.. విటమిన్-సి, మెగ్నీషియం, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లు తింటే నెలసరి సమయంలో వచ్చే తలనొప్పి,కడుపునొప్పి, వికారం, ఉబ్బరం వంటివి తగ్గుతాయి. చిక్కుళ్లు.. చిక్కుళ్లలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతుంది. వీటిలో ఉండే పోషకాలు తలనొప్పిని తగ్గిస్తాయి.                                     *నిశ్శబ్ద.   

హెయిర్ డై ఎడా పెడా వాడేస్తున్నారా..అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం.! ప్రతి ఒక్కరూ వాటిని పూర్తి చేసి తమ జుట్టుకు కొత్త రూపాన్ని తేవాలని తాపత్రయం పడుతుంటారు. ఇందుకోసం హెయిర్ స్ట్రెయిటెనింగ్, హెయిర్ కలరింగ్, హెయిర్ స్మూత్ చేయించుకోవడం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. అయితే  కానీ, FDA (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఇటీవలే బాంబు పేల్చింది.  ఫార్మల్డిహైడ్ రసాయనం ఉన్నటువంటి హెయిర్ ఉత్పత్తుల వాడకాన్ని నిశేధించింది.   స్ట్రెయిటెనింగ్, కలరింగ్, హెయిర్ స్మూత్ చేయడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయా..? జుట్టును సిల్కీగా, మృదువుగా మార్చే ఉత్పత్తులలో ఉపయోగించే రసాయనాల వల్ల  భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ కలరింగ్ లో వాడే రసాయనాల వల్ల కళ్ళు, ముక్కు, గొంతులో చికాకు కలిగిస్తుందని. ఇది శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుందని  భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు కూడా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం: జుట్టు ఉత్పత్తులు గర్భాశయం లేదా అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది.  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్ రికార్డ్) 2022 అధ్యయనం నుండి అనేక సూచనలు ఉన్నాయి. హెయిర్ ఉత్పత్తుల్లో వాడే ఫార్మాల్డిహైడ్  క్యాన్సర్ కణాలను ప్రేరేపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ డై వల్ల బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం: తాజాగా వచ్చిన ఒక పరిశోధనలో హెయిర్ డై మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తుంది.  దాదాపు 80% హెయిర్ డై ఉత్పత్తులు హైడ్రోజన్ పెరాక్సైడ్ నుండి తయారవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు. ఇవి మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది: ఇక హెయిర్ స్ట్రెయిట్‌నర్‌లు లేదా రిలాక్సర్‌లు రొమ్ము, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కార్సినోజెనిక్ ఏజెంట్‌లను కలిగి ఉంటాయని ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్, మిథిలిన్ గ్లైకాల్ వంటి సమ్మేళనాలు. దీనికి కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సూచన ఇదే: సహజ సిద్ధమైన హెన్నా వంటి జుట్టు ఉత్పత్తులను గుర్తించి వాటిని మాత్రమే ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  

మహిళలలో మెనోపాజ్ సమయంలో వచ్చే నిద్రలేమికి భలే పరిష్కారాలు.! ఆడవారి జీవితంలో ప్రతి దశలోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. 10 నుండి 15 ఏళ్ల మద్య మొదలయ్యే ఋతుచక్రం 40ఏళ్లు వచ్చేవరకు ఉంటుంది. ఆ తరువాత ఋతుచక్రం ఆగిపోతుంది. అన్నేళ్లు శరీరంలో క్రమానుసారంగా సాగిన ఈ ప్రక్రియ ముగిసిపోవడం కారణంగా మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ప్రధానంగా ఉంటుంది. సరిగా నిద్రలేకపోవడం, కలత నిద్ర, తలనొప్పి, శరీరంలో అసౌకర్యంగా అనిపించడం, హార్మోన్ సమస్యల కారణంగా నిద్ర సమస్యలు వస్తాయి. దీన్ని పరిష్కరించడానికి ఈ కింది చిట్కాలు సహాయపడతాయి. మెగ్నీషియం.. శరీరంలో స్కిరాడియన్ సైకిల్ లేదా సహజ గడియారం నియంత్రణ కోల్పోయినప్పుడు కండరాల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషీయం తీసుకోవడం ద్వారా కండరాలు సడలించబడతాయి, నిద్ర గడియారం కంట్రోల్ లోకి వస్తుంది. నిద్ర బాగా పడుతుంది. అల్లం, జీడిపప్పు, బాదం, నువ్వులలో మెగ్నీషియం బాగుంటుంది. విటమిన్-ఇ మెనోపాజ్ సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు పుడుతుంటాయి. రాత్రి సమయంలో చెమటలు కూడా పడతాయి.  విటమిన్-ఇ  శరీరానికి లభించేలా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, కొబ్బరి, అవిసె గింజలు, పిస్తాపప్పులలో విటమిన్-ఎ సులభంగా దొరుకుతుంది. ఒమెగా-3 ఒమెగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు మానసిక కల్లోలాన్ని, నిద్రలేమి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.  చేపలు, సజ్జలు, బార్లీ, మొక్కజొన్న, రాగులు  మొదలైన వాటిలో ఒమెగా-3 లభ్యమవుతుంది. సోయా ఉత్పత్తులలో ఐసోప్లేవోన్ లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ను అనుసరిస్తాయి. శరీరంలో వేడి ఆవిర్లు తగ్గించడం, ఋతుక్రమం ఆగిపోయినప్పుడు కనిపించే లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల సోయా ఉత్పత్తులు వాడితే నిద్ర నాణ్యత బాగుంటుంది.                                        *నిశ్శబ్ద.

గర్బినీ మహిళలు ఉసిరికాయ రసం తాగవచ్చా! గర్భధారణ సమయం మహిళల జీవితంలో చాలా సున్నితమైన దశ. ఈ సమయంలో తీసుకునే ఆహారం, పానీయం గర్బవతులకే కాకుండా  కడుపులో పెరిగే బిడ్డల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చలికాలం గడుస్తోంది. ఈ చలికాలంలో విరివిగా దొరికే ఉసిరికాయలు గొప్ప రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఉసిరికాయలు తిన్నా, దాని జ్యూస్ తాగినా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే గర్బవతులు ఉసిరికాయ రసాన్ని రోజూ తీసుకోవచ్చా? ఇది వారి ఆరోగ్యానికి మంచిదేనా అనే విషయం తెలుసుకుంటే.. గర్భవతులు ఉసిరికాయ రసాన్నితీసుకోవచ్చు. దీనివల్ల గర్భవతులలో ఎదురయ్యే కడుపులో వికారం, వాంతులు వంటి సమస్యలు  అదుపులో ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఉసిరికాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఉసిరికాయ రసాన్ని ప్రతిరోజూ తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలే పొందవచ్చు. అయితే తాజా  ఉసిరి రసం దొరకకపోతే మార్కెట్లో దొరికే ఉసిరికాయ రసాన్ని కూడా వాడచ్చు. కానీ ఈ రసాలు ప్రభుత్వ అమోదం, ఫుడ్ కమీషన్ వారి ఆమోదం పొందినవి అయి ఉండాలి. ప్యాకేజింగ్, నిల్వ కూడా పక్కాగా ఉండాలి. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే మరొక ప్రయోజనం.. NCBI పరిశోధన ప్రకారం, ఉసిరిని తీసుకోవడం ద్వారా అనేక రకాల వాస్కులర్ డిజార్డర్‌లను నివారించవచ్చు. ఉసిరిలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంతో పాటు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది HDL కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది మరియు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఉసిరికాయను ఎలా తీసుకోవాలి?  గర్భవతులు ఉసిరిని తీసుకోవాలని అనుకుంటే వాటిని తాజాగా,  పచ్చిగా తినడం మేలు. నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్యలలో ఉసిరికాయ తినడం మంచిది. మురబ్బా, జామ్, ఊరగాయ, బర్ఫీ ,  పొడితో పాటు, సంవత్సరం పొడవునా లభించే ఉసిరి నుండి రసం కూడా తయారు చేస్తారు.  వీటిని పరిమిత పరిమాణంలో కూడా తీసుకోవచ్చు.  ఎందుకంటే ప్యాక్ చేసిన ఆహారం తాజా ఆహారం కంటే తక్కువ పోషకాహారాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లోనే ఉసిరికాయ జ్యూస్.. ఉసిరికాయ జ్యూస్ తాగాలని  ఉంటే ఇంట్లోనే తయారుచేసుకుని ఫ్రెష్ గా తాగితే బాగుంటుంది. ప్యాక్ చేయబడిన జ్యూస్‌లలో సాధారణంగా ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు ఉంటాయి. ప్యాక్ చేసిన ఉసిరి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. కొనుగోలు చేయడానికి ముందు జ్యూస్ ప్యాకెట్ సీలు చేయబడిందో లేదో తనిఖీ చేయాలి.   దాని గడువు తేదీని కూడా చెక్ చేసుకోవాలి.  గర్భధారణ సమయంలో మధుమేహం అటాక్ అయినట్టయితే తప్పనిసరిగా వైద్యుల సలహాతోనే దీన్ని వాడాలి.  జ్యూస్ తాగే ముందు అందులో కొంచెం నీరు కలపాలి. ఎందుకంటే ఉసిరికాయ జ్యూస్ ఎక్కువ ఆమ్లగుణం కలిగి ఉంటుంది. దీన్ని అలాగే తాగితే గొంతులో చికాకు, అసౌకర్యం కలుగుతుంది. అదే నీళ్లలలో కలుపుకుంటే ఆమ్లగుణం సర్దుకుంటుంది.  (నోట్: ఇది ఆహారనిపుణలు, వైద్యులు  పలు సందర్బాలలో చెప్పిన విషయాల ఆధారంగా ఇచ్చిన సమాచారం.  గర్భవతులు తమ ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహా మేరకే ఆహారం, మందులు తీసుకోవాల్సి ఉంటుంది.)                                                 *నిశ్శబ్ద.  

పీరియడ్స్ నొప్పికి మహిళలు వాడే ఈ టాబ్లెట్ ఎంత డేంజరో తెలుసా? దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలను అయినా ఒకటి రెండు రోజులు భరించగలరు చాలామంది. కానీ నొప్పులను మాత్రం అస్సలు భరించలేరు. దీనికి కారణం ఏ పని చేయాలన్నా శరీరంలో వివిధ అవయవాలు, భాగాలు నొప్పితో సహకరించకపోవడమే. అందుకే నొప్పులు రాగానే మొదట టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకుంటారు. ఇలాంటి నొప్పి మాత్రలలో మెప్టాల్ కూడా ఒకటి. ఇది సాధారణ నొప్పులకే కాకుండా పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలను కూడా తగ్గిస్తుంది. సాధారణంగా నొప్పుల మాత్రలు 15నిమిషాలలోనే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మెప్టాల్ కు సంబంధించి సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మాత్ర ఉపయోగించడం తగ్గించమని చెప్పింది. అసలు ఈ మాత్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం, వైద్యులు ఏం చెబుతున్నారు? ఇది వాడటం ప్రమాదం ఎందుకు? పూర్తీగా తెలుసుకుంటే.. అసలు సమస్య ఇదీ.. అసలు సమస్య ఏంటంటే.. ఎలాంటి ఆందోళన లేకుండా ఈ పెయిన్ కిల్లర్ వాడుతున్నారు.  ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అయినప్పటికీ, పీరియడ్స్ లో వచ్చే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు, తలనొప్పి, కండరాలు,  కీళ్ల నొప్పులు,  అధిక జ్వరం నుండి ఉపశమనం పొందడానికి ఫెనామిక్ యాసిడ్ భారతదేశంలో సర్వసాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది Meftal, Mefkind, Mefnorm,  Ibuklin P పేర్లతో విక్రయించబడుతోంది. డ్రగ్ సిండ్రోమ్.. మెప్టాల్ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల చాలామందిలో డ్రగ్ సిండ్రోమ్ ఎదువుతుంది. డ్రగ్ సిండ్రోమ్ అనేది మందులు తీసుకున్న తరువాత దాదాపు 10శాతం మందిని ప్రభావితం చేస్తుంది. దీంట్లో ఇసినోపిలియా, శారీరక  లక్షణాలు కూడా ఉంటాయి. జ్వరం, చర్మం పై  దద్దుర్లు, లెంఫాడెనోపతి, హెమటోలాజికల్ వంటి అసాధారణ లక్షణాలు మందులు తీసుకున్న రెండు నుండి ఎనిమిది వారాల తరువాత కనిపించడం ప్రారంభిస్తాయి. దీనికి పరిష్కారం కంటే సమస్య రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. ఈ మందుల వినియోగానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆప్షన్స్.. మెఫెనామిక్ యాసిడ్ మందులపై ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శోరరస కణువులలో వాపు పెరుగుతుంది. మెఫెనామిక్ యాసిడ్ మందులు ఎవరైనా ఉపయోగిస్తంటే వాటికి ప్రత్యామ్నాయ మందుల గురించి ఆలోచించాలి. మెప్టాల్ మందులు ఎక్కువ కాలం తీసుకుంటే అవి కడుపులో అల్సర్, రక్తప్రసరణ, పొట్టకు సంబంధించిన సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు ఈ మందులకు ప్రత్యామ్నాయం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని  వేరే మందులు ఉపయోగించాలి. అసలు సమస్యలివీ.. మెఫ్టాల్ మాత్రలు హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ మందుల వల్ల హృదయ సంబంధ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు మెప్టాల్ ను వినియోగించకపోవడమే మంచిది. ఇది కిడ్నీ సమస్యలను కూడా పెంచుతుంది.                                                      *నిశ్శబ్ద.   

చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. గర్బిణుల్లో ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడుగా జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, పొడి చర్మం వంటిసమస్యలు పెను సవాళ్లుగా మారుతుంటాయి. సాధారణంగానే రోగనిరోధోకశక్తి తక్కువగా ఉంటే గర్భిణులకు చలికాలం గడ్డుకాలమే. అలాని పెద్దగా భయపడాల్సిన అవసరంలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో గర్భిణీలు ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఎక్కువ నీళ్లు తాగాలి: వాతావరణం చల్లగా ఉంటే అస్సలు దాహం వేయదు. అలాని నీళ్లు తాగకుండా ఉంటే డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంటుంది. గర్భిణులు ఈ విషయం మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే శరీరంలో నీటిస్థాయి లేనట్లయితే ఉమ్మనీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇది ఇలానే కొనసాగితే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టె అవకాశం ఉంటుంది. కాబట్టి కాలమేదైనా వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో నీళ్లు తాగడం మంచిది. కొబ్బరి నీళ్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. కీళ్లనొప్పులు: చలికాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. చల్లగాలులకు శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోయి రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో కండరాలు, కీళ్లు బిగుసుకుపోతాయి. అంతేకాదు గుండెకూ రక్తం సరఫరా కాదు. గర్బిణుల్లో ఇలాంటి సమస్యలు ఉంటే అది కడుపులో ఎదిగే బిడ్డకు కూడా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి సమస్యలెదుర్కొనే గర్భిణులు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం అరోమా థెరపీ చక్కగా ఉపయోగపడుతుంది. ఈక్రమంలో లావెండర్, టీట్రీ, యూకలిప్టస్ వంటి నూనెలతో శరీరమంతా మసాజ్ చేసుకోవడం రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో శారీరక నొప్పులు తగ్గడమే కాదు..ఆరోగ్యమూ కూడా ఇనుమడిస్తుంది. ఈ చిట్కాతో పొడిచర్మం సమస్య కూడా చాలా తగ్గుతుంది. అయితే ఇవి సహజసిద్ధమైన నూనెలే అయినప్పటికీ గర్బిణులు వీటిని వాడే విషయంలో ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. చర్మ సంరక్షణ: చలికాలమంటే చాలా మంది భయపడుతుంటారు. కారణం చర్మం పొడిబారుతుంది. దీంతో దురద, మంటతో ఇబ్బంది పడుతుంటారు. గర్భిణీల్లో పొట్ట పెరిగిన కొద్దీ చర్మం సాగుతుంది. దీంతో మరింత దురద పుడుతుంది. దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే స్ట్రెచ్ మార్క్స్ తో తిప్పలు తప్పవు. అందుకే డాక్టర్ సలహా మేరకు క్రీములు, లోషన్లు, నూనెలు కూడా వాడవచ్చు. వాటితో రోజుకు ఒకటి లేదా రెండు సార్లు పొట్ట భాగంలో మర్దన చేసుకుంటే అటు రక్తప్రసరణ మెరుగవుతుంది. ప్రసవానంతరం స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా ఈ చిట్కా సహాయపడుతుంది. మిగతా భాగాల్లో చర్మ సంరక్షణ కోసం పొడి జుట్టు నుంచి విముక్తి పొందడం కోసం నిపుణుల సలహా మేరక సంబంధిత సౌందర్య ఉత్పత్తులు వాడటం మంచిది. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకున్న సహాజ సిద్ధమైన బ్యూటీ ఉత్పత్తులు కూడా వాడవచ్చు. ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండేందుకు: చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. దీనికి తోడు గర్భం ధరించిన 3 లేదా 4నెలల పాటు వేవిళ్ల సమస్య వేధిస్తుంది. ఫలితంగా శరీరం మరింత నీరసించిపోయే ప్రమాదం కూడా ఉంది. తద్వారా కడుపులో పెరుగుతన్న బిడ్డపైన కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం నుంచి ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల శరీరం ఉత్తేజితమవడంతో పాటు మనసకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గర్భం ధరించిన సమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న విషయం గురించి మీరు సొంత నిర్ణయం తీసుకోకుండా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.  

గర్భధారణ సమయంలో మహిళలు తప్పకుండా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!    మహిళలు గర్భం దాల్చడం అనేది ప్రత్యేక వరం.  ఆ సమయంలో  చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం నుండి విహారం వరకు గర్బవతుల చిట్టా ప్రత్యేకం. ముఖ్యంగా చలికాలంలో గర్భవతులు ఆరోగ్యం  విషయంలో కేర్ తీసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్యాలు ఎదురుకాకుండా, ఒకవేళ ఎదురైనా సరే అవి గర్భవతులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యమే.  ఈ కింద చెప్పుకునే డ్రింక్స్ గర్భవతులకు చలికాలంలో చాలా మేలు చేస్తాయి. వేడినీటితో నిమ్మరసం.. వేడినీటిలో కాసింత నిమ్మరసం కలిపి తీసుకోవడం చాలామంది చేస్తుంటారు. అయితే ఇది గర్భవతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇమ్యునిటీ పెంచడంలో సహాయపడుతుంది. సీజనల్ సమస్యలు రాకుండా చేస్తుంది. పుట్టబిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం మంచిది. అల్లం పాలు.. అల్లం గొప్ప  ఔషద గుణాలు కలిగి ఉంటుంది. అల్లాన్ని పాలలో వేసి బాగా ఉడికించి దీన్ని గోరువెచ్చగా ఉన్నట్టే తాగాలి. గర్భవతులు అల్లం పాలు తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో వాంతుల సమస్య  తగ్గుతుంది. అలాగే ఉదర సంబంధిత సమస్యలు అంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. వేడి పాలు.. వేడిపాలు పోషకాన్ని మాత్రమే కాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా వేడిపాలు తాగడం వల్ల  పదే పదే అనారోగ్యానికి గురయ్యే సమస్య తగ్గుతుంది. చికెన్-ఆనియన్ సూప్.. గర్భవతులు మాంసాహారులైతే వైద్యుల సలహా మీదట చికెన్-ఆనియన్ సూప్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. కండరాలు బలంగా ఉంటే మహిళలకు గర్భాన్ని మోయడంలో ఇబ్బంది ఉండదు.                                        *నిశ్శబ్ద. (మనిక: గర్భవతుల ఆహారానికి సంబంధించి పోషకాహార నిపుణులు, వైద్యులు పలు వేదికలల్లో పేర్కొన్న విషయాల ఆధారంగా ఈ సమాచారం అందించబడింది. గర్భవతులు ఆహారం విషయంలో తమ వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం మంచిది)

మహిళలు బలంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాలి!! ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు, వైద్యులు కూడా. మహిళలు చాలావరకు మానసికంగా బలంగానే ఉంటారు. కానీ శారీరకంగా బలంగా ఉండే మహిళలు చాలా తక్కువ. ముఖ్యంగా నేటి కాలంలో మహిళలు అయితే చాలా సున్నితం ఉంటారు. పెళ్లై, ఓ ఇద్దరు పిల్లల్ని కంటే ఇక చాలా బలహీనం అయిపోతారు. కానీ ఈ బలహీనత రాకూడదన్నా,. ఆల్రెడీ వచ్చిన బలహీనతను అధిగమించాలన్నా ఈ కింది ఆహారాలు తప్పక తినాలి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు మహిళలకు చాలా అవసరం. మహిళలకు కాలం గడిచేకొద్ది ఎముకలు చాలా తొందరగా బలహీనం అవుతాయి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు అధిగమించవచ్చు. ఎముక బలం ఉంటే మహిళలు చాలావరకు బలంగా ఉంటారు. పాలు, పెరుగు,  పాల ఉత్పత్తులు, ఫూల్ మఖనా మొదలైన కాల్షియం ఆహారాలు రోజూ తినాలి. మహిళలలో రక్తహీనత సమస్య కూడా ప్రముఖమైనది. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నెలసరి అస్తవ్యస్తం అవుతుంది. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు బాగా తీసుకుంటే ఈ సమస్యలు అధిగమించవచ్చు. నువ్వులు, బెల్లం, పల్లీలు, చేపలు, బీన్స్ వంటి ఆహారాలలో ఐరన్ బాగా ఉంటుంది.   గుండె ఆరోగ్యం, నరాల ఆరోగ్యం, జీవక్రియ, రక్తప్రసరణ మొదలైనవాటికి ఫోలేట్ చాలా అవసరం. ఇది లోపిస్తే గర్భదారణ సమయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. పోలిక్ యాసిడ్ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలు, చిక్కుళ్లు, కమలాపండ్లు, కరివేపాకు, బ్రోకలి, బెండకాయ, గుడ్లు, ఆవు పాలు మొదలైనవాటిలో ఫోలెట్ సమృద్దిగా ఉంటుంది. మహిళలలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి బాగా తీసుకోవాలి. ఇది చర్మ ఆరోగ్యాన్నికూడా కాపాడుతుంది. నిమ్మజాతి పండ్లు, సిట్రస్ ఆధారిత కూరగాయలు, స్ట్రాబెర్రీలు మొదలైనవాటిలో విటమిన్-సి లభిస్తుంది. సరైన బరువు ఉంటే సగం ఆరోగ్యంగా ఉన్నట్టే. బరువు బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి. గుండె జబ్బులను, మధుమేహాన్ని కూడా పైబర్ దరిచేరనివ్వదు. ఫైబర కోసం తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు బెస్ట్ ఆప్షన్. శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం, పాస్పరస్ శరీరానికి అందాలి. ఇవి అందాలంటే విటమిన్-డి ఖచ్చితంగా అవసరం. విటమిన్-డి లోపిస్తే  కాల్షియం, పాస్పరస్ ఉన్న ఆహారాలు తిన్నా సరే ఎముకలు బలంగా మారవు. కాబ్టటి విటమిన్-డి తప్పనిసరిగా అందేలా చూడాలి. సూర్యుడి లేతకిరణాలు శరీరం మీద పడుతున్నప్పుడు ఆ ఎండలో గడపాలి. పుట్టగొడుగులు, చేపలు, పాలు, గుడ్లు బాగా తీసుకోవాలి. మహిళల శరీరంలో కండరాలు బలంగా ఉండాలంటే ప్రోటీన్ బాగా అందాలి. ఇది శరీరంలో కండర కణాల రిపేర్ కు సహాయపడుతుంది. కాయధాన్యాలు, గుడ్లు, చేపలు, పాలు వంటి ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి. రక్తపోటు అదుపులో ఉండాలంటే పొటాషియం తప్పనిసరి. కండరాలు, నరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా ఇది అవసరం. పాలకూర, బీన్స్, అరటిపండ్లు తీసుకుంటూ ఉంటే పొటాషియం బాగా లభిస్తుంది.                                                            *నిశ్శబ్ద.  

గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు తింటే అంతే సంగతులు! ఆడపిల్ల జీవితంలో వివాహం, గర్బం దాల్చడం కీలకమైన మలుపులు. వీటి తరువాత నుండి మహిళల జీవితం చాలా మార్పులకు లోనవుతుంది. పండంటి పాపాయి పుట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలని  వైద్యుల నుండి పెద్దల వరకు చెబుతారు. అయితే ఇప్పటి కాలం అమ్మాయిలు చాలామంది ఉద్యోగాల కారణంగా పెద్దలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరికి అసలు తాము తీసుకునే ఆహారాల మీద స్పష్టతే ఉండదు.  ఈ కింది ఆహారాలు గర్బవతులు అస్సలు తీసుకోకూడదని, అలా తింటే మాత్రం చాలా ప్రమాదమని అంటున్నారు.  ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ గర్భవతులు మొలకెత్తిన గింజలకు దూరం ఉండాలి. మొలకెత్తిన గింజలలో బ్యాక్టీరియా  ఎక్కువగా డవలప్ అవుతుంది.  వీటిని తింటే జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. పాలు కూడా ఆరోగ్యానికి మంచివే అయినా పాశ్చరైజేషన్ చేయని పాలు మాత్రం గర్భవతులకు ప్రమాదం. వీటిలో  లిస్టేరియా, ఇకోలి, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగిస్తాయి. ఉడికించిన కోడిగుడ్లు అందరికీ మంచివే.  అయితే కొందరు పచ్చిగుడ్లు కూడా తింటారు. మరికొందరు హాఫ్ బాయిల్ అంటూ సగం ఉడికీ ఉడకని గుడ్లు తింటారు. అయితే గర్భవతులు ఆరోగ్యం బాగుండాలంటే పచ్చిగుడ్లు తినడం అవాయిడ్ చేయాలి. దీవివల్ల వాంతులు, వికారం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. గర్భవతులు మద్యపానం, ధూమపానంకు దూరం ఉండాలి. ఇవి కడుపులో బిడ్డకు హాని కలిగిస్తాయి. సముద్రంలో లభించే క్యాట్ ఫిష్, షార్క్ వంటి చేపలలో పాదరసం ఎక్కువ శాతం ఉంటుంది. ఈ చేపలను తినడం వల్ల కడుపులో బిడ్డ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. బొప్పాయికి, గర్భిణులకు మద్య ఉండే విషయాలు అందరికీ తెలిసిందే. అయితే పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భిణులకు గర్భస్రావం  అయ్యే కారణం ఉంటుంది. కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో కెఫిన్ ఆరోగ్యం చేకూరుస్తుంది. కానీ కాపీ ఎక్కువ తాగితే కెఫిన్ కంటెంట్ కడుపులో బిడ్డపై చెడు ప్రభావం చూపిస్తుంది.  కెఫిన్ తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి.                                               *నిశ్శబ్ద.

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు! ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల జీవితంలో అయినా గొప్ప సందర్భం ఏదైనా ఉందంటే అది వారు తల్లికావడమే. నవమాసాలు మోసి బిడ్డను కంటారనే విషయం తెలిసిందే అయినా ఆ తొమ్మిది నెలలు మహిళలు తమ జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటార. ఆహారం దగ్గర నుండి శరీరాకృతి వరకు ప్రతి ఒక్కటీ మారిపోతుంది. అయితే ప్రసపం తరువాత పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం. సుమారు 6నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు కూడా చెబుతారు. అయితే తల్లిపాలు ఇవ్వడం గురించి చాలామంది మహిళలలో అపోహలు ఉన్నాయి. పాలు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని,  ఎన్ని నెలల వరకు పిల్లలకు పాలు ఇవ్వాలని, తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఏమిటని ఇలా చాలా విషయాలలో  అపోహలు, వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే అందరికీ ఈ విషయంలో ఒక అవగాహన ఏర్పడుతుంది. పాలివ్వడంలో అసౌకర్యం.. ప్రసవించిన తరువాత పిల్లలకు పాలివ్వడంలో ప్రతి తల్లీ అసౌకర్యానికి గురవుతుంది. పిల్లలు పాలు తాగడం లేదని, పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటుంటారు. అయితే మొదటిసారి ప్రసవం అయిన మహిళలకు పిల్లలను హ్యాండిల్ చేయడం, రొమ్ములకు దగ్గరగా పిల్లలను పెట్టుకోవడం, పిల్లలకు సౌకర్యంగా ఉండటం వంటి వాటిలో కాస్త విఫలం అవుతారు. ఇది రోజులు గడిచేకొద్ది అలవాటు అవుతుంది. పిల్లలకు పాలిచ్చేటప్పుడు పెద్దల సహాయం తీసుకుంటే ఇందులో ఇబ్బంది చాలా వరకు అధిగమిస్తారు. పాలిచ్చే ముందు శుభ్రత.. చాలామంది పిల్లలకు పాలిచ్చే ముందు రొమ్ములను, చనుమొనలను శుభ్రం చేసుకోవడం గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇలా శుభ్రం చేయాల్సిన అవసరమే లేదు. పిల్లలు ప్రసవించిన తరువాత తల్లిని వాసన, స్పర్శ ద్వారా గుర్తిస్తారు. చనుమొనలలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీని వాసన కారణంగా పిల్లలు తమ తల్లులను గుర్తిస్తారు. ఇది  పిల్లలకు  ఉపయోగకరమైనది. కాబట్టి పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రం చెయ్యాల్సిన అవసరం లేదు. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగించకూడదు.. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగిస్తే అవి పిల్లలకు చెడు చేస్తాయని చాలామంది అంటారు. అయితే పాలిచ్చే తల్లులు తమ సమస్యలను వైద్యులతో చెప్పేటప్పుడు పిల్లలకు పాలిస్తున్న విషయాన్ని చెప్పాలి. దీన్ని బట్టి వైద్యులు ప్రత్యేక మందులు సిఫారసు చేస్తారు. వీటి వల్ల తల్లీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే వైద్యులు సూచించిన విధంగానే మందులు తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. సొంతంగా మందులు వాడటం, వైద్యులు చెప్పిన నిర్ణీత కాలం కంటే  ఎక్కువ రోజులు  మందులు పొడిగించి వాడటం చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిపాలివ్వకూడదు.. తల్లులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలకు పాలివ్వకూడదని చాలా మంది అంటారు. అయితే ఇది తల్లులకు ఉన్న సమస్య పైన ఆధారపడి ఉంటుంది. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలో కూడా కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే  ఆహారం, పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం తల్లులకు ఎంతో ముఖ్యం. అనారోగ్యాన్ని బట్టి వైద్యుల సలహా మీద మాత్రమే పిల్లలకు పాలివ్వడం మంచిది. తల్లులకు పాల కొరత.. చాలామంది మహిళలు తమకు పాలు తక్కువ పడుతున్నాయని, పిల్లలకు సరిపోవడం లేదని ఫర్యాదు చేస్తుంటారు. అయితే ఇది చాలా వరకు అపోహే అని అంటున్నారు. బిడ్డను రొమ్ముపై సౌకర్యవంతంగా ఉంచుకుని పాలివ్వడంలోనే చాలావరకు పొరపాటు జరుగుతుందట. సౌకర్యవంతంగా పిల్లలకు రొమ్ము అందిస్తే పిల్లలు కూడా కడుపు నిండుగా పాలు తాగుతారు. అలాగే పిల్లలు పాలు ఎంత బాగా తాగితే తల్లులలో పాలు అంత బాగా ఉత్పత్తి అవుతాయి. ఆహారం.. పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో ఎలాంటి గందరగోళం చెందాల్సిన పనిలేదు. అందరిలానే పాలిచ్చే తల్లులు కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలి. తల్లులు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారిలో పాలు ఉత్పత్తి కావడంలో సమస్యలు ఎదురే కావు. గమనిక: పై విషయాలు పోషకాహార నిపుణులు, మహిళా వైద్యులు పలుచోట్ల ప్రస్తావించిన అంశాల ఆధారంగా పొందపరచబడినవి.                                         *నిశ్శబ్ద. 

ఏం చేసినా హిమోగ్లోబిన్ పెరగట్లేదా? అయితే ఇలా చేయాల్సిందే.. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అవసరం అవుతాయి. శరీరం మొత్తం ఆరోగ్యాన్ని నిర్దేశించగల సామర్థ్యం రక్తానికి ఉంది. శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడినంత లేకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఈ రక్తహీనత ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా ఎదురవుతుంటుంది. ఐరన్ స్థాయిలు మెరుగుపరుచుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ ను భర్తీ చేసుకోవచ్చు. దీని కోసం మహిళలు తప్పక తినాల్సిన ఆహారాలేంటో తెలుసుకుంటే.. ఆహారంలో మొక్కల ఆధారిత పదార్థాలు అయిన గింజలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి పుష్కలంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే శరీరంలో ఐరన్ బాగా లభిస్తుంది. పైపెచ్చు ఇవి శరీరంలో ఐరన్ సరఫరాను కూడా ప్రోత్సహిస్తాయి. ఆకుకూరలు, పండ్లు, గింజలే కాకుండా ఆహారంలో లీన్ మాంసం, చికెన్, పాలు, గుడ్లు, బీన్స్, కాయధాన్యాలు, జున్ను, బచ్చలికూర, బ్రోకలీ వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిలో ఏవో కొన్ని అయినా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే  తప్పనిసరిగా ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. చాలామంది ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా హిమోగ్లోబిన్ పెరగడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే విటమిన్-సి పుష్కలంగా తీసుకునేవారికే  ఐరన్ పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే ఐరన్ ను శరీరం ఫర్పెక్ట్ గా గ్రహించడానికి విటమిన్-సి సహాయపడుతుంది. శరీరం ఐరన్ గ్రహించడానికి కేవలం విటమిన్-సి మాత్రమే కాదు, విటమిన్  బి12 కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పాలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మొదలైనవాటిలో విటమిన్-బి12 ఉంటుంది. వీటిని తీసుకుంటే ఐరన్ ను కూడా సులువుగా పొందగలుగుతారు.                                                        *నిశ్శబ్ద.