Home » Sree Sree » Srisri Kathalu


                            పెద్దాపురం ముదనష్టం
    
    పెద్దాపురం అతగాడి ఊరు పేరు కాదని ముందుగా
    చెప్పాలి. అప్పుడు పరిశేగ న్యాయంగా అది ఇంటిపేరని
    గ్రహించేస్తా రంతమందీ! కాని, వ్యాకరణ శాస్త్రంతో
    పరిచయం ఉన్నవాళ్ళు పెద్దాపురపు అనాలని సవరణ
    తీసుకురావచ్చు. అయితే ఆ సవరణను ఈ రచయిత
    అంగీకరించలేడు. ఎందుచేతనంటే ఇతగాడి ఇంటిపేరు
    శ్రీరంగం అంతేకాని శ్రీరంగపు కాదు.
    ఇంటిపేరు గురించి ఏదో పరిష్కారం కుదిరింది. కాని, మరి పేరు మాటేమిటో ఎంతటి ముదనష్టపు తల్లిదండ్రులయినా తమ అల్లారు ముద్దుబిడ్డకి అంత అసహ్యమైన పేరు పెడతారా? అటువంటి పేరేగాని, అటువంటి పేరుగల పెద్దమనిషి లేదా చిన్నమనిషి గాని ఉండడానికి వీలులేదనీ, ఇదేదో ఈ రచయిత స్వకపోల కల్పన అనీ ఎవరయినా అనుమానించడానికి ఆస్కారం లేకపోలేదు.
    అసలు నిజం ఏమిటంటే అతని తల్లిదండ్రులు ఏ అప్పారావు అనో, సుబ్బారావు అనో మామూలు పేరే పెట్టారు. రైల్వేలో పనిచేస్తున్న రోజుల్లో అతను అప్పారావుగానో, లేక సుబ్బారావుగానో చలామణీ అయాడు. పత్రికా ప్రపంచంలో ప్రవేశించిన తరువాత అతని అభిప్రాయాలన్నీ మారిపోయాయి. అనంతకోటి అప్పారావుల్లో తానో అనామధేయుడుగా మిగిలిపోవడం అతనికి మనస్కరించలేదు. తనకో వ్యక్తిత్వం కావాలి. తన పేరులా మరోపేరు ఉండడానికి వీలులేదు. ఈ ఉద్దేశంతో అతను "రామబాణం" "అయస్కాంతం" "త్రిఫలరసం" అంటూ ఎన్నెన్నో పేర్లు మార్చి ఎన్నెన్నో రచనలు చేశాడు. ఆఖరికి గ్రంథ సమీక్షలు చేసినప్పుడు పొడి అక్షరాలు కూడా వాడి చూశాడు. ఆ రోజుల్లోనే ముదనష్టం అనే పేరు అతన్ని ఆకర్షించింది. ఇదే తనకు తగ్గ పేరు అని ఎందుకో అతనికి నమ్మకం కుదిరింది. ఇది తగినంత అందంగా వినిపించడానికి గాను "సుందర" అనే అక్షరాలు బిగించగానే తనదీ అని చెప్పుకోదగ్గ పేరు దొరికిందనే సంతోషమూ, సంతృప్తి అతనికి కలిగాయి.
    ఆ తర్వాత ఇక పేర్లు మార్చవలసిన అవసరం అతనికి లేకపోయింది. "సుందర ముదనష్టం" అన్న పేరుతోనే అతను యావత్పత్రికా ప్రపంచాన్ని వొక ఊపు ఊపించాడు అతను ఆపేరుతోనే ఉర్రూతలూగుతూ ఊరేగాడు, ఊళ్ళేలాడు బాగా కలిగిన కుటుంబం పుట్టినవాడు కాబట్టి ముదనష్టం సొంతంగా నాలుగయిదు పత్రికలు పెట్టాడు. కాని, పత్రికా నిర్వహణ అనే వ్యాపారంలో ప్రాధమిక సూత్రాలు కూడా తెలియని వాడు కాబట్టి ముదనష్టంతో పత్రికలన్నీ చల్లారి పోయాయి. వొకప్పుడు మనదేశంలో పత్రికా వ్యాసంగి వొక తపస్సులా వుండేది. కాని, ఇప్పుడా తరం పోయింది. ఆదర్శాలు వల్లిస్తూ కూర్చుంటే ఆకలి తీరదు. ఇక సొంత డబ్బు ఖర్చుపెట్టి పత్రికలు తీసుకురాకూడదనే నిర్ణయానికి అతడు వచ్చేశాడు పత్రికా రచయితగా తనకు పుష్కలంగా కీర్తి లభించింది. పత్రికాధిపతిగా కూడా పేరు పొందాలనుకోవడం గొంతెమ్మ కోరిక. పైగా అందువల్ల బోలెడు ధన నష్టం కూడా ఎదురవుతూంది. అందుచేత ఉన్న పత్రికల్ని ఉద్దరిస్తే చాలు? కొత్త పత్రికలు స్టాపించి చేతులు కాల్చుకోవడం తనవంటి ప్రతిభాశాలికి తగిన పనికాదు.
    తర్వాత అతడెన్నో పత్రికలలో పనిచేశాడు. ఎక్కడా వొక ఆరునెలలకంటే ఎక్కువ కాలం ఉండలేకపోయేవాడు. తనకున్న అనుభవాన్ని ఎవరూ అర్ధం చేసుకోలేక పోతున్నారేమిటి? ఇక ఈ జర్నలిజానికి వొక సలాం కొట్టేసి రాజకీయాల్లో చేరిపోతే ఎలా వుంటుంది? అప్పుడప్పుడీ విషయమై అతడు చాలా తీవ్రంగా ఆలోచించాడు. కాని, పత్రికా రచన తనకు వ్యసనం అయిపోయింది. వాదులు కోవాలన్నా వదులుకోలేని స్థితి ఏర్పడింది. ఎన్నెన్ని పత్రికలు మార్చాడు. ఎంత సాహిత్యం సృష్టించాడు! అప్పుడు మారడానికి కూడా పత్రికలు లేకపోయాయి. వెనకటి అలెగ్జాండర్ చక్రవర్తి తాను జయించడానికి దేశాలే లేవని వాపోయిన సంగతి గుర్తుకు వచ్చింది. అప్పుడే ఇక రాజకీయాలలో ప్రవేశించాలన్న ఉద్దేశం నుంచి విరమించుకున్నాడు. కారణం ఏమిటంటే మారడానికి పార్టీలే మిగలవేమో నన్న భయం! ఏమయినా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగల రాజకీయ నాయకుల కన్నా ప్రభుత్వాలను పడగొట్ట గలిగిన పత్రికా రచయితలే గొప్పవారని అతని నమ్మకం. ఇందులో అతనికి అమెరికన్ జర్నలిజం ఆదర్శమయింది. కొన్నాళ్ళబాటు అమెరికాకు పోయి ఏ న్యూయార్కులోనో మకాం పెడితే ఎలా వుంటుంది? అన్న ఆలోచన కూడా అతడికి రాకపోలేదు. కాని తెలుగు దేశాన్ని వదిలిపెట్టి మరెక్కడకు వెళ్ళినా, నీళ్ళలో నుంచి బయటపడ్డ చేపనయిపోతానని అమెరికా ప్రయాణం విరమించుకున్నాడు. ఏదయినా స్వదేశాభిమానంలో ఎవరికీ తీసిపోనివాడు శ్రీయుత పెద్దాపురం సుందరముదనష్టం.
    తెలుగుదేశంలో తన పేరుకున్న విలువను అమెరికా వాళ్ళు ఎలా అర్ధం చేసుకోగలరు? ఇంట గెలిచిన తర్వాతనే కదా రచ్చ గెలవడం? అయినా ఇంటిలో ఇంకా పూర్తి విజయం సాధించలేదే! ఒక్క ముద్రారాక్షల మీదనే తన దండయాత్ర ఇంకా అసంపూర్తిగా ఉండిపోయిందే. ఒక విధంగా ఆలోచిస్తే తెలుగు గ్రంధాలదీ, పత్రికలదీ అచ్చుతప్పులలో అగ్రతాంబూలం. ఈ ప్రథమ స్థానానికి మనం అందరమూ గర్విస్తూ ఉంటేనే మంచిది.
    ముదనష్టం అవివాహితుడని చెప్పటానికి నేను చింతిస్తున్నాను. కానీ. అతనికి మాత్రం ఆ చింత అణుమాత్రమూ లేదు. దీని వెనుక ఒక చిన్నకథ ఉంది. చిలవలూ, పలవలూ కల్పించకుండా గల్పిక లాగ టూకీగా చెప్పేస్తాను.
    చాలాకాలం క్రిందట మిక్కిరూనీ నటించిన ఒక హాలీవుడ్ చిత్రాన్ని చూశాడు ముదనష్టం. అందులో రూపినీ ఎవరో అడుగుతారు. "ఏరా అబ్బాయీ! ఇంకా పెళ్ళి చేసుకోవడం లేదే?" మని, దానికి మిక్కిరూని జవాబు "పెళ్ళి చేసుకుని ఒక అమ్మాయిని యావజ్జీవితమూ బాధపెట్టడం కన్నా పెళ్ళిచేసుకోకుండా చాలామంది అమ్మాయిల్ని సుఖపెట్టడం మంచిది కదా!" అని ఈ ఫిలాసపీ ముధనష్టానికి చాలా నచ్చింది. కాని, తానొక భారతీయుడుగా విశ్లేషించి ఆధ్యాత్మిక సంపదతో తులతూగుతున్న భారతదేశపు పౌరుడుగా ఇటువంటి పాశ్చాత్యభావాలకు దాసోహం కావడమేనని అప్పుడప్పుడతనికి అనిపిస్తుంది. పైకి దీనికి ప్రచారం ఇవ్వకుండా ఆచరణలో అవలంబించడం మంచిదనే పరిష్కారం దానంతట అదే అతనికి దారి చూపించింది. ఆశయాలు ఉండడం మంచిదే. వాటిని తరచు వల్లిస్తూండడము మరీ మంచిదే కాని, జీవితంలో రాజీలు కూడదని భీష్మించుకు కూర్చోవడం కూడా మంచిది కాదు. మధ్యేమార్గం అనే గత్యంతరాన్ని కూడా మన దేశమే కదా ప్రపంచానికి ప్రసాదించింది. వివాహంలాంటి వ్యక్తిగత విషయాలలో మన ఆదర్శవాదం పనికి రాదు. ఏకపత్నీవ్రతం ఆరాధించడానికి మనమందరమూ రామచంద్రమూర్తులం కాముకదా! పైగా పదహారు వేలమంది గోపికా స్త్రీలను రంజించిన పరమాత్ముడు కూడా మన దేవుడే!
    తెలుగుభాషకు కాని తెలిగు పత్రికకు కాని ఎంత సేవచేసినా ఎవరూ గుర్తించరని అనుభవం వల్ల తెలుసుకున్న ముదనష్టం అమాంతంగా అభిప్రాయాలు మరోసారి మార్చుకొని ఈ మధ్యనే ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. లేదా ఆ అమ్మాయ్ ముదనష్టాన్ని పెళ్లి చేసుకుందనడం సత్యానికి సమీపంగా రావడం! తెలుగుదేశాన్నీ, భారతీయ సంస్కృతినీ ప్రేమించి ఆమె అమెరికా నుంచి కాదు గాని, యూరప్ లోని ఏదో దేశం నుంచి రావడమేమిటి? భారతీయతకి ముదనష్టం ఒక్కడే ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాడని గ్రహించడమేమిటి-ఒక్కసారే జరిగిపోయాయి. జీవితం పొడుగునా రాజీలు పడుతూ జీవించేవాడే ధన్యుడని గ్రహించిన ముదనష్టం పెళ్ళికి సంబంధించిన అభిప్రాయాలన్నిటినీ కాగితాలబుట్టలో పారేశాడు.
    ఇప్పుడా పుణ్యదంపతులు ఏమైనదీ, ఎక్కడున్నదీ నాకు తెలియదు. కాని తెలుగుదేశంలోనే ఉన్నారనీ, తెలుగుపత్రికలనే నడుపుతున్నారనీ మాత్రం కొన్ని నిదర్శనాలను చెప్పగలను. ముదనష్టం పదహారణాల తెలుగువాడు కాబట్టి తెలుగుదేశాన్ని వదిలి వుండలేడు. భారతీయ నాగరికతకు పరమ ప్రతినిధి కాబట్టి అతన్ని వదిలి ఆమె వుండలేదు. ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో నికరంగా చెప్పలేక పోయిన, అటువంటి వాడు ఎక్కడో ఒకచోట వుండి ఏదో ఒక పని చేస్తూ ఉండడమే మన దేశపు అదృష్టమని చెప్పగలను.
    వాళ్ళ చహరా కనిపెట్టడానికి నేనొక అపరాధ పరిశోధకున్ని గాను, వాళ్ళు అపరాధులంతకన్నా కాదు. నా పరిశోధన ఎంత అపరిపక్వంగా ఉందంటే ఆ అమ్మాయి కూడా నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా సరిగా ఉచ్చరించ గలుగుతానన్న ధైర్యం నాకు లేదు.
    అందుచేత ఆ అమ్మాయిని శ్రీమతి ముదనష్టం, మీ కిష్టమైతే సుందర ముదనష్టం ఇంకా మరీ ఇష్టమైతే శ్రీమతి పెద్దాపురం సుందర ముదనష్టం అని పిలిస్తే చాలనుకుంటాను. పిలవడాని కెక్కడైనా కనిపిస్తే కదా అని కొందరి కనుమానం కలగవచ్చు. అలాగయితే అలా పిలవడం మానేస్తే సరిపోతుంది.
    శ్రీయుత ముదనష్టం తన భార్యారత్నాన్ని సినిమాతారగా మలచాలని చూశాడు. ఇంకా ప్రపంచమంతా తన చెప్పుచేతల్లో ఉన్నందుకు ఈ మాత్రపు చిన్న పని చేయించలేకపోతానా అనుకున్నాడతను. శ్రీమతికి తెలుగుభాష రాదు. తనకు తెలిపిన ప్రొడ్యూసర్లందరూ తెలుగువాళ్ళు తెలుగు సినీపరిశ్రమలో ఆమెకు గొప్ప భవిష్యత్తు వుందనీ. అందుకు భాష ఒకటే ప్రతిబంధకంగా వుందని గ్రహించడానికతని కెంతోసేపు పట్టలేదు.
    ఆమెచేత ఎలాగయినా తెలుగు మాట్లాడించాలని పెద్ద బాలశిక్ష కొనుక్కుని వచ్చాడు ముదనష్టం పూనిక వల్ల ఆమె తెలుగుభాషలో నిష్ణాతురాలయి పోయింది.
    ఇప్పుడామె ఒక గొప్ప తెలుగుసినిమా పత్రికను నడిపిస్తోంది. శ్రీయుత ముదనష్టం గొప్ప సినిమాస్టార్ అయిపోయాడు.
    
                                 ---౦౦౦---


Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More