ఆ తర్వాత నుదురు కొట్టుకుంటూ "సరయూ... ఓసరయూ... ఎక్కడ చచ్చావే? ఇది కూడా కొంపముంచింది!" అని కేకలు పెట్టింది.

 

    పెద్దక్క వంటింట్లోనుండి వచ్చి పరిస్థితి అర్థం చేసుకుని ఓ మూల చాప పరిచింది.

 

    నన్నో అంటరానిదాన్లా చూస్తూ ఓగ్లాసు, ప్లేటూ మూలపారేశారు. నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నదాన్లా బిక్కుబిక్కుమంటూ మోకాళ్ళల్లో తలదూర్చి కూర్చున్నాను.

 

    నాన్న ఆఫీసునుండి వచ్చాకా, సన్నగా ఏడుపు గొంతుతో అమ్మ ఏదో అంటోంది.

 

    నాకు సుబ్బలక్ష్మి చెప్పిన రంగురంగుల పట్టు పరికిణిలూ, మిఠాయిలూ, పూలజడా, ఫోటోలూ గుర్తొచ్చాయి. జీవితంమీద విరక్తి కలిగింది.

 

    తాతగారు కుక్కి మంచంలోంచి "దానికి కాస్త దిష్టితీసిపొయ్యండే! పత్యంగా పెట్టండి... ఏవిటో దానిదాకా వచ్చేటప్పటికి ఏమీ మిగలలేదు!" అంటున్నారు.

 

    చిన్నక్క చాటుగా వచ్చి నా తలమీద ముద్దు పెట్టుకుంది. పక్కన ఓపాత తాటాకు బొమ్మ పెట్టారు. తోడుట! తోడులేకుండా ఆడపిల్ల బతకకూడదని చెప్పడానికేమో. అమ్మ పాతచీర చింపి పైట వేయించింది.

 

    నాకెందుకో గుండెలమీద చాలా బరువుగా అనిపించింది! జీవితాంతం మొయ్యాలి కదా.

 

    మూడు రోజులు నాలిక చచ్చిపోయేట్టు పెసరపప్పు అన్నం పెట్టారు. నాలుగోనాడు చీకట్నే తలంటుపోశారు. ఆ స్నానానికి నేను సొక్కి సోలిపోయాను.

 

    రాజమండ్రి నుండి మేనత్త వచ్చింది. వెంట చీకేసిన తాటిపండులాంటి తలతో సన్నగా పొడుగ్గా వెదురు గొట్టంలాంటి అబ్బాయిని వెంటపెట్టుకొచ్చింది.

 

    "మా మరిది కొడుకు. దత్తత తీసుకోబోతున్నాను" అంది.

 

    తాతయ్య మూల్గుతూ "తమ్ముడికి ముగ్గురు ఆడపిల్లలు. ఆస్తి తరగదనా ఈ దత్తత!" అన్నారు.

 

    ఆ మాటలు విన్న అత్తయ్య నవ్వుతూ "అందుకే నాన్నా! ఆముక్తని ఇచ్చి చేస్తే ఇటు కోడలూ, అటు కొడుకూ ఇద్దరూనన్ను కనిపెట్టుకుని వుంటారు" అంది.

 

    ఆమె అన్నది విన్న నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ బెదురుచూపులు చూసే చీకేసిన తాటి తలవాడిని నేను పెళ్ళిచేసుకోవాల్నా! అనుకున్నాను.

 

    అత్తయ్య మెడలోంచి అటుకుల గిలుసుతీసి నా మెడలో వేసి "నా కోడలు చక్కనిదే" అంది.

 

    అత్తయ్యకి పెళ్ళయిన ఏడాదికి భర్తపోయాడు. పిల్లలులేరు. కొబ్బరి తోటలూ లంకంతా ఇల్లూ ఉన్నాయట. మెడ తిరగని సొమ్ములున్నాయి. ఎప్పుడూ గుంటూరు జరీ చీరల్లో కేలండర్ లో లక్ష్మీదేవిలా ఉంటుంది. అమ్మ ఆవిడకి ఒదిగి ఒదిగి సేవలు చేస్తుంది.

 

    ఇంత ఆస్తివున్నా నాన్న చీర పెట్టలేదనో, సరిగ్గా చూడలేదనో ఏడ్చి ముక్కు చీదుతూనే ఉంటుంది. 'ఎంగిలి చేత్తో కాకిని కొట్టదు' అని చాటుగా తిడ్తుంది అమ్మ. నాకు గొలుసు ఇవ్వడం విచిత్రంగా అనిపించింది.

 

    అత్తయ్య పోరుమీద అమ్మ నాకు కొత్త ఓణీ, పాత పట్టుచీర చింపి పరికిణీ కుట్టించి పేరంటం చేసింది.

 

    "నువ్వు మా ఇద్దరికంటే చాలా అందంగా ఉన్నావు ముక్తా!" అంది మెచ్చుకోలుగా చిన్నక్క.

 

    పెద్దక్క ఎందుకో ఈ మధ్య మందకొడిగా ఉంటోంది.

 

    "పెద్దదానికి సంబంధాలు చూస్తున్నారా? మనలో మనమాట. సీతారాముడు మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడట!" అంది అత్తయ్య.

 

    నాన్న కోపంగా "ఏం మాటలవి అక్కా? పెళ్ళాంపోయి నలుగురు పిల్లలున్న సీతారాముడికి నా కూతుర్ని ఇవ్వాలా" అని మండిపడ్డాడు.

 

    "పిల్లలున్నా వయసేం మించిపోయిందనీ? ముఫ్పై ఆరేళ్ళు" అంది అత్తయ్య.

 

    లేత అరటిదూటలా ఉన్న అక్కవైపు నేనూ, చిన్నక్కా జాలిగా చూశాం.

 

    "నువ్వేం కలగజేసుకోకు. నాపాట్లేవో నే పడ్తాలే!" నిష్ఠూరంగా అన్నారు.

 

    సాయంత్రం శివా వాళ్ళమ్మకూడా పేరంటానికి వచ్చింది.

 

    మైసూర్ సిల్క్ చీరలో తెల్లగా, నాజూగ్గా ముట్టుకుంటే మాసిపోయేట్లు ఉందావిడ.

 

    ఆ లావణ్యం, హుందాతనం అంతా డబ్బువల్ల వస్తుందనుకుంట అనుకున్నాను.

 

    "మీ అమ్మాయిలు ముగ్గురూ బావుంటారు. బోలెడు పనిమంతులు. ఇంటికి లక్ష్మీకళ ఆడపిల్లల వల్లే వస్తుంది. మీరు అదృష్టవంతులు" అంది అమ్మతో.

 

    అమ్మ పెదవి విరిచి "గుండెలమీద కుంపట్ల భారం మీకెలా తెలుస్తుంది? మీకు మహరాజులా ఒక్క మగపిల్లవాడు. దేనికైనా పెట్టి పుట్టాలి" అని నిట్టూర్చింది.

 

    అక్కలిద్దరూ తలలు క్రిందకి వాల్చుకున్నారు.

 

    "అమ్మా" అంటూ శివ వచ్చాడు.

 

    నేను తల ఎత్తగానే చిన్నగా నవ్వాడు.

 

    నాకు కొత్తగా అనిపించింది. గుండెల మీద చెయ్యి వేసుకుని అప్రయత్నంగా పైట సర్దుకున్నాను. ఒళ్ళంతా ఏదో సరికొత్త సందడి. నేను ప్రవాహంలో పడికొట్టుకుని వెళ్ళిపోతున్నట్లుగా హుషారుగా, అలజడిగా ఉంది! అలవోకగా కళ్ళెత్తి దొంగచూపులు చూసాను.

 

    శివ అదోలా నవ్వి వెళ్ళిపోయాడు.

 

    చీపిరి తలవాడు అత్తయ్యతోబాటు ఇంకో నాల్గురోజులు ఉన్నాడు. వాడ్ని బావ అనమని అత్తయ్యపోరు. వాడు ఉత్తబడాయికోరు. నన్ను పిలిచి 'మంచి నీళ్ళియ్యి' అనో 'తుండు కావాలి' అనో అధికారంగా అడిగేవాడు. నేను కంపరంగా చూస్తూ వెళ్ళిపోయేదాన్ని.

 

    బడికి వెళ్తూంటే శివ వచ్చి కలిశాడు.

 

    "బావి దగ్గర కాసేపు ఆగు" అన్నాడు. ఆ తర్వాత సైకిల్ మీద రయిమని వెళ్ళిపోయాడు.