"అది గూండా రాజ్యంలా కనిపిస్తోంది".. నటి కస్తూరి ట్వీట్ వైరల్!
on May 7, 2021
ఒకప్పటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాలు, ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు. స్వతహాగా లాయర్ కావడంతో అన్ని విషయాలపై సమగ్ర అవగాహనతో మాట్లాడుతుంటారు. కస్తూరి శంకర్ చేసే కామెంట్స్ ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తుంటాయి.
తాజాగా కస్తూరి శంకర్ పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటనపై స్పందించారు. బెంగాల్ లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్ఛగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ లో కేంద్రమంత్రి మురళీధరన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు దుండగులు విదేశాంగశాఖ సహాయమంత్రి కాన్వాయ్ పై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు.
ఈ ఘటనపై నటి కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది సెక్యూరిటీతో వచ్చే కేంద్ర మంత్రికే ఇలా జరిగితే.. వారి కింద పని చేసే నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితేంటో ఊహించుకోలేకపోతున్నానని అన్నారు. వాళ్లు అసలు మనుషులేనా.. గూండా రాజ్యంలా కనిపిస్తోందంటూ కస్తూరి ఫైర్ అయింది. ప్రస్తుతం ఈమె 'గృహలక్ష్మి' అనే సీరియల్ లో నటిస్తోంది.
Also Read