స్మాల్ స్క్రీన్పై రీ-ఎంట్రీకి తారక్ రెడీ!
on Mar 7, 2021
స్టార్ మా చానల్లో బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్గా వ్యవహరించడం ద్వారా తొలిసారి స్మాల్ స్క్రీన్పై దర్శనమిచ్చిన జూనియర్ ఎన్టీఆర్, నాలుగేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అవును. ఈసారి జెమినీ టీవీ కోసం హోస్ట్ సీట్లో కూర్చోబోతున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తుండగా బ్లాక్బస్టర్ హిట్టయిన గేమ్ షో 'కౌన్ బనేగా క్రోర్పతి' తెలుగు వెర్షన్ 'ఎవరు మీలో కోటీశ్వరులు'కు ఆయన హోస్ట్గా కనిపించనున్నారు. జెమినీ టీవీ యాజమాన్యం అధికారికంగా ఈ విషయం ప్రకటించకపోయినా, ఇప్పటికే ఇది బహిరంగ రహస్యంగా మారింది. తారక్ ఫ్యాన్స్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దీనిని వైరల్గా మారుస్తున్నారు.
నిజానికి ఈ గేమ్ షో ఇదివరకు స్టార్ మా చానల్లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో నాలుగు సీజన్ల పాటు ప్రసారమైంది. మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తే, 2017లో వచ్చిన నాలుగో సీజన్కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా వ్యవహరించారు. ఆ తర్వాత స్టార్ మా ఆ షోను ఆపేసింది. కారణం మునుపటి సీజన్లతో పోలిస్తే నాలుగో సీజన్కు టీఆర్పీ తక్కువ రావడం. చిరంజీవి హోస్ట్గా వ్యవహరిస్తే, బ్లాక్బస్టర్ అవుతుందనుకుంటే అందుకు విరుద్ధంగా తుస్సుమని లెక్కలు తారుమారవడం నిర్వాహకులను షాక్కు గురిచేసింది.
ఇప్పుడు ఈ గేమ్ షో స్టార్ మా నుంచి జెమిని టీవీకి మారింది. దాంతో పేరును కొద్దిగా మార్చారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను 'ఎవరు మీలో కోటీశ్వరులు'గా చేంజ్ చేశారు. వచ్చే ఏప్రిల్లోనే ఈ షో ప్రసారం కానున్నట్లు సమాచారం. లేటెస్ట్గా ఈ షో లోగో టీజర్ను వదిలింది జెమిని టీవీ. "మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు" త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి." అంటూ లోగోను ఆవిష్కరించడంతో పాటు, పక్కనే హోస్ట్ సీట్లో కూర్చున్న మనిషిని సిలౌట్ రూపంలో చూపించింది. ఆ హోస్ట్ తారక్ అని తెలిసిపోతోంది.
వ్యూయర్స్ను తన వాగ్ధాటితో మెస్మరైజ్ చేయగల శక్తి తారక్ను ఉందని నమ్మిన నిర్వాహకులు ఆయనకు భారీ మొత్తం ఆఫర్ చేసి, ఒప్పించారనేది ఇండస్ట్రీ వర్గాల మాట. మరో నెలలో ప్రారంభం కానున్న ఈ షోతో తారక్ ఏం చేస్తాడో.. వెయిట్ అండ్ సీ...
Also Read