సమంత గెలిచిన రూ. 25 లక్షలకు తారక్ ఎవరి పేరిట చెక్కు రాశాడో తెలుసా?!
on Oct 16, 2021
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో దసరా పండగ రోజు గెస్ట్ కంటెస్టెంట్గా అప్పీరెన్స్ ఇచ్చింది సమంత రూత్ ప్రభు. నాగచైతన్యతో విడిపోయినట్లు అనౌన్స్ చేశాక ఆమె కనిపించిన ఫస్ట్ పబ్లిక్ అప్పీరెన్స్ ఇదే. ఈ ఎపిసోడ్ అంతా ఫన్ మోడ్తో జరగగా, తారక్ అడిగిన సరదా ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానం చెప్పడానికి ట్రై చేసింది సమంత. అయితే ఇదివరకటి జోష్ ఆమెలో కనిపించలేదనేది నిజం.
ఆసక్తికరమైన విషయమేమంటే తారక్ అడిగిన ప్రశ్నల్లో చాలావరకు ఏదో విధంగా సమంత జీవితానికి సంబంధించినవే. వర్కవుట్స్, డాగ్స్, 'శాకుంతలం' మూవీతో అనుసంధానమైన పురాణానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి.
'ఆర్ఆర్ఆర్' మూవీ టీజర్స్ గురించి మాట్లాడిన సమంత.. ఆ సినిమా కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ ఇద్దరినీ ప్రశంసించింది. అమితమైన టాలెంట్ ఉన్నవాళ్లుగా కీర్తించింది. ఆ వెంటనే తారక్, "అప్పట్లో సావిత్రిగారు మహానటి, నువ్వు ఈనాటి మహానటి. మహానటికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నీకున్నాయి" అని ప్రస్తుతించాడు.
గెస్ట్ కంటెస్టెంట్ గెలుచుకోవడానికి అవకాశమున్న రూ. 25 లక్షలను సమంత గెలిచింది. ఈ షోలో గెలిచిన ప్రైజ్ మనీని గెస్ట్లు చారిటీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. సమంత కూడా తను నడుపుతోన్న ప్రత్యూష సపోర్ట్కు ఈ ప్రైజ్ మనీని ఇస్తున్నట్లు ప్రకటించింది. తారక్ కూడా ఆమె గెలుచుకున్న మనీకి సంబంధించిన చెక్కుపై 'ప్రత్యూష సపోర్ట్' పేరిటే రాశాడు. ఆ చెక్కు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.