"మీరు తాత".. యాంకర్ రవికి పవన్ కూతురి షాక్!
on May 7, 2021
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య.. యాంకర్ రవిల మధ్య జరిగిన సంభాషణ అందరినీ నవ్విస్తోంది. కొన్నాళ్లుగా రేణు బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జీతెలుగులో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోకి సింగర్ సునీత, ఎస్వీ కృష్ణారెడ్డిలతో పాటు రేణు దేశాయ్ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ షోకి ఆద్యను గెస్ట్ గా ఆహ్వానించారు.
మదర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆద్యకు యాంకర్ రవి గ్రాండ్ వెల్కమ్ చెప్పగా.. కూతుర్ని స్టేజ్ పై చూసిన రేణు ఆద్య దగ్గరకు వెళ్లి ఆమెని హగ్ చేసుకుంది. ఈ ప్రోమోలో ఆద్యను బాగా హైలైట్ చేశారు. 'వకీల్ సాబ్' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆద్య తనదైన మాటలతో ఆకట్టుకుంది. ఈ షోకి మరో జడ్జ్ అయిన సునీతతో కలిసి గొంతు కలిపి 'నీలి నీలి ఆకాశం' పాటను పాడింది ఆద్య.
ఆ తరువాత యాంకర్ రవి తన గురించి తనే ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ.. "నా పేరు రవి నేను ఇక్కడ హోస్ట్ ను" అని చెప్పాడు. వెంటనే సునీత కలుగజేసుకొని.. "రవి మీ అమ్మను అక్కా అని పిలుస్తాడు. కాబట్టి నువ్ రవిని మామ అని పిలువు" అంటూ ఆద్యకు చెప్పింది. రవి కూడా "ఒక్కసారి మావయ్యా అని పిలువమ్మా?" అనడిగాడు. వెంటనే రియాక్ట్ అయిన ఆద్య.. "మీరు తాతా" అని కౌంటర్ ఇచ్చింది. దీంతో రవి షాకవుతూ ఆమెని అలాగే చూస్తుండిపోతే, మిగతావారంతా పడీ పడీ నవ్వారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు పవన్ కూతురు కదా.. ఆ మాత్రం చలాకీతనం ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read