షాహిద్కు నో చెప్పిన రష్మిక! కారణం ఏంటో తెలుసా?
on May 15, 2021
సౌత్లో ఇప్పటికే పాగా వేసేసిన క్యూట్ గాళ్ రష్మికా మందన్న నార్త్లోనూ తన హవా చూపించేందుకు రెడీ అవుతోంది. దక్షిణాదిన తెలుగు, కన్నడ భాషా చిత్ర రంగాలలో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె, సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోన్న 'మిషన్ మజ్ను' మూవీతో బాలీవుడ్లో అడుగు పెడుతోంది. అంతే కాదు, అమితాబ్ బచ్చన్తో కలిసి 'గుడ్బై' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
అయితే చాలామందికి తెలీని విషయం.. నిజానికి రష్మిక 'జెర్సీ' రీమేక్ ద్వారా బాలీవుడ్లో అడుగు పెట్టాల్సింది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన 'జెర్సీ' ఇటు ప్రేక్షకుల ఆదరణ, అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండు నేషనల్ అవార్డ్స్ కూడా సాధించింది. ఆ మూవీని రూపొందించిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఫస్ట్ చాయిస్ రష్మిక. కానీ చివరకు 'సూపర్ 30' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ఆ పాత్రను చేజిక్కించుకుంది.
'జెర్సీ' రీమేక్లో రష్మిక ఎందుకు భాగం కాలేదు? ఆ ఆఫర్ను రష్మిక స్వయంగా తిరస్కరించిందని సమాచారం. అవును. తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన ఆ రోల్కు తాను న్యాయం చేయలేనని భావించిన రష్మిక దాన్ని చేయలేనని చెప్పేసింది. అయితే ఆమె ఆ క్యారెక్టర్ను వదులుకోవడానికి ఇంకో కారణం కూడా ప్రచారంలోకి వచ్చింది. అది డీగ్లామర్ క్యారెక్టర్ కావడం, ఒక పిల్లాడికి తల్లి క్యారెక్టర్ కావడం వల్లే దాన్ని చేయడానికి రష్మిక ఇష్టపడలేదని సోషల్ మీడియాలో నలుగుతోంది.
Also Read