సీనియర్ నటి జయంతి ఇకలేరు
on Jul 26, 2021
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీలో పలు చిత్రాల్లో నటించిన సీనియర్ నటి జయంతి మృతి చెందారు. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు ఆమె కుమారుడు కృష్ణకుమార్ తెలియజేశారు.
జయంతికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తడంతో జూలై 6న బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. డాక్టర్ సతీష్ ఆమెకు చికిత్స అందించారు. గత 38 ఏళ్లుగా జయంతికి ఆస్థమా ఉంది. గతంలో 2018లో ఒకసారి శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడ్డారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యంగా బయటపడ్డారు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జూలై 6న ఆస్పత్రిలో జాయిన్ చేసిన తర్వాత కరోనా నేపథ్యంలో ఎవరూ చూడటానికి రావొద్దని కుమారుడు విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ 'శ్రీరామాంజనేయ యుద్ధం', 'జగదేకవీరుని కథ', 'రక్త సంబంధం', ఏయన్నార్ 'దేవదాసు', 'డాక్టర్ చక్రవర్తి', చిరంజీవి 'కొదమసింహం', 'దొంగమొగుడు' తదితర తెలుగు చిత్రాల్లో జయంతి నటించారు. అన్ని భాషల్లో సుమారు 500లకు పైగా సినిమాలు చేశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు.