'అఖండ' వర్సెస్ 'ఖిలాడి'.. తప్పదా?
on Apr 15, 2021
కరోనా భయంతో సినిమా విడుదలలు వాయిదా పడుతూ రావడం చూస్తున్నాం. ఎప్పుడు థియేటర్లను మూసివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయో, లేదంటే 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోమంటారోననే సందేహాలతోనూ, కరోనా వల్ల ఆశించిన కలెక్షన్లు రావనే భయంతోనూ నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి వెనుకాడుతున్నారు. అట్లా ఈ నెలలో రావాల్సిన 'లవ్ స్టోరి', 'టక్ జగదీష్', 'విరాటపర్వం' సినిమాల విడుదలను పోస్ట్పోన్ చేస్తున్నట్లు వాటి నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ ఫిల్మ్ 'ఆచార్య' కూడా వెనక్కి తగ్గనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం మే 14న ఆ సినిమా విడుదల కావాలి. వాయిదా వేసిన సినిమాల కొత్త రిలీజ్ డేట్లను నిర్మాతలు ప్రకటించడం లేదు. పరిస్థితులను బట్టి వాటిని అనౌన్స్ చేయాలని వారు భావిస్తున్నారు.
అయితే రెండు సినిమాలు మాత్రం చెప్పిన టైమ్కే ఆడియెన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. అవి.. బాలకృష్ణ 'అఖండ', రవితేజ 'ఖిలాడి'. పైగా ఆ రెండూ ఒకే తేదీన రిలీజ్ కానున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. ఆ తేదీ.. ఎన్టీఆర్ జయంతి అయిన మే 28! ఇప్పటివరకూ ఆ రెండు సినిమాల నిర్మాతల నుంచి విడుదల తేదీ వాయిదా వేస్తున్నట్లు ఎలాంటి సంకేతాలూ బయటకు రాలేదు. ఆ తేదీని వదులుకోవడానికి వారు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.
బాలయ్య అయితే మే 28న 'అఖండ'ను విడుదల చేయడానికే కట్టుబడి ఉన్నారని సన్నిహిత వర్గాల సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆరోజు 'అఖండ' రావడం ఖాయమే. ఇక 'ఖిలాడి'ని ఆ రోజే తీసుకు రావాలనేది నిర్మాత కోనేరు సత్యనారాయణ సంకల్పం. అంటే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 'అఖండ' వర్సెస్ 'ఖిలాడి' అనే స్థితి ఉంది.
ఉగాది నాడు రిలీజ్ చేసిన 'అఖండ' టైటిల్, బాలయ్య సెకండ్ క్యారెక్టర్ రివీల్ టీజర్ ఆ సినిమాపై బజ్ను అమాంతం పెంచేసింది. రెండు రోజుల పాటు యూట్యూబ్లో నంబర్ వన్గా అది ట్రెండింగ్లో ఉండటం గమనార్హం. అంతకు ఒకరోజు ముందు రిలీజ్ చేసిన 'ఖిలాడి' టీజర్ సైతం ఆ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. పైగా 'క్రాక్' సక్సెస్తో రవితేజ ఫుల్ జోష్లో ఉన్నాడు. మరి బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలు మే 28న కొట్లాటకు దిగుతాయో, విడుదల తేదీని వాయిదా వేసుకుంటాయో చూడాల్సిందే.