సాగరకన్య.. టాలీవుడ్ రి-ఎంట్రీ?
on May 14, 2021
తెలుగులో తక్కువ సినిమాలే చేసినా.. స్టార్ హీరోలతోనే జట్టుకట్టి వార్తల్లో నిలిచారు శిల్పా శెట్టి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `బాజీగర్` (1993)తో నాయికగా తొలి అడుగులేసిన శిల్ప.. 1996లో విడుదలైన `సాహసవీరుడు - సాగరకన్య`(విక్టరీ వెంకటేశ్ కథానాయకుడు)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆపై `వీడెవడండీ బాబూ!` (కలెక్షన్ కింగ్ మోహన్ బాబు), `ఆజాద్` (కింగ్ నాగార్జున), `భలేవాడివి బాసూ!` (నటసింహ బాలకృష్ణ) చిత్రాల్లో సందడి చేశారు. 2001లో విడుదలైన `భలేవాడివి బాసూ!` తరువాత మళ్ళీ తెలుగులో దర్శనమివ్వని శిల్పా శెట్టి.. అతి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో రి-ఎంట్రీ ఇవ్వనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో `అతడు`, `ఖలేజా` చిత్రాల తరువాత ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ ముఖ్య పాత్ర కోసం శిల్పతో సంప్రదింపులు జరుపుతున్నారట త్రివిక్రమ్. త్వరలోనే `#SSMB 28`లో సాగరకన్య ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. రెండు దశాబ్దాల అనంతరం తెలుగు బాట పడుతున్న శిల్పా శెట్టి.. ఈసారైనా వరుస సినిమాలతో అలరిస్తారేమో చూడాలి.