అమెరికా వీసాల కోసం మహేష్ టీమ్ వెయిటింగ్
on Oct 20, 2020
సూపర్స్టార్ మహేష్ బాబు అండ్ 'సర్కారు వారి పాట' టీమ్ అమెరికా వీసాలు ఎప్పుడు వస్తాయా? అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.
బ్యాంకింగ్ రంగంలోని ఆర్థిక మోసాల నేపథ్యంలో దర్శకుడు పరశురామ్ 'సర్కారు వారి పాట' స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. ఇందులో మహేష్ బ్యాంకు ఉద్యోగిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. కొందరు చేసిన మోసాలు వల్ల తన తండ్రి బలి అయితే వాళ్ళపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? బ్యాంకులకు వాళ్ల చేత ఏ విధంగా తిరిగి డబ్బులు కట్టించాడు? అనేది చిత్రకథ అని తెలుస్తోంది. అమెరికా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అందుకని అమెరికాలో చిత్రీకరణ చేయాలని యూనిట్ వీసాల కోసం అప్లై చేసింది. ఆల్రెడీ పేపర్ వర్క్ అంతా పూర్తయిందని వీసాలు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నామని నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవిశంకర్ తెలిపారు.
కరోనా వల్ల ప్రభావితమైన దేశాలలో అమెరికా ఒకటి. అక్కడ వైరస్ విజృంభించి విలయతాండవం చేసింది. అటువంటి దేశానికి వెళ్లి చిత్రీకరణ చేయడానికి మహేష్ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేద్దామని యూనిట్ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారని సమాచారం. నవంబర్ తొలివారంలో సినిమా యూనిట్ అమెరికా వెళ్ళవచ్చు. డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి వరకు అక్కడే చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేశారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే.