ప్రభాస్కు నో చెప్పిన పూజ!
on Apr 20, 2021
ప్రభాస్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తోన్న 'రాధే శ్యామ్' మూవీపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ 2019లో ఇటలీలో మొదలైంది. గత ఏడాది జార్జియాలో కొద్ది రోజులు షూటింగ్ చేశాక భారత్లో లాక్డౌన్ విధించడంతో హడావిడిగా యూనిట్ ఇండియాకు తిరిగొచ్చేసింది. తిరిగి నవంబర్లో షూటింగ్ పునఃప్రారంభించి, చాలావరకు షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ నిర్వహిస్తున్నారు.
అయితే ఇటీవల ప్రభాస్కు చాలా సీన్లు నచ్చలేదనీ, వాటిని రిషూట్ చెయ్యాలనీ డైరెక్టర్కు చెప్పినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ షికారు చేశాయి. అయితే అందులో నిజం లేదని యూనిట్ వర్గాలు స్పష్టం చేశాయి. ఓ కీలక పాత్ర చేస్తున్న కృష్ణంరాజుకు సంబంధించిన కొన్ని సీన్లు మాత్రమే మిగిలున్నాయనీ, అలాగే ప్రభాస్-పూజా హెగ్డే సీన్లకు సంబంధించిన కొంత ప్యాచ్వర్క్ ఉందనీ అవి తెలిపాయి.
లేటెస్ట్గా బ్యాలెన్స్ ఉన్న ప్యాచ్వర్క్ను పూర్తి చేయడానికి పూజను కాల్షీట్ అడిగితే ఆమె నో చెప్పిందంటూ ప్రచారం జరుగుతోంది. కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందున ఇంట్లో నుంచి బయటకు రావడానికి పూజ ఇష్టపడటం లేదు. అందుకే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాకే షూటింగ్కు వస్తానని ఆమె చెప్పిందంటున్నారు. మరోవైపు కృష్ణంరాజు వయసును దృష్టిలో పెట్టుకొని ఆయన సీన్లను వాయిదా వేశారు.
జూలై 30న 'రాధే శ్యామ్'ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దానికి ఇంకా సమయం ఉన్నందున ఈలోగా బ్యాలెన్స్ ప్యాచ్వర్క్, కృష్ణంరాజు సీన్లు పూర్తి చేస్తామనే భరోసాను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.