రవితేజ.. ముచ్చటగా మూడోసారి?
on Mar 8, 2021
మాస్ మహారాజా రవితేజకి ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. `ఓ పనైపోతుంది బాబూ!`, `విక్రమార్కుడు`, `దరువు`, `కిక్ 2`, `డిస్కో రాజా` చిత్రాల్లో డబుల్ ధమాకా ఇచ్చారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `ఖిలాడి` కూడా ఇదే తరహా సినిమానే. `రాక్షసుడు` ఫేమ్ రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రెండు విభిన్న పాత్రల్లో రవితేజ దర్శనమివ్వనున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇందులో రవితేజ తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపించనున్నారట. అదే గనుక నిజమైతే.. `కిక్ 2`, `డిస్కో రాజా` తరువాత మాస్ మహారాజా ముచ్చటగా మూడోసారి తండ్రీకొడుకులుగా నటించే సినిమా ఇదే అవుతుంది. మరి.. `కిక్ 2`, `డిస్కో రాజా` ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. `ఖిలాడి` అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
`ఖిలాడి`లో రవితేజకి జంటగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. మే 28న `ఖిలాడి` థియేటర్స్ లో సందడి చేయనుంది.