గీతరచయితగా త్రివిక్రమ్ కి 18 ఏళ్ళు!
on Jun 19, 2021
త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మాటల రచయితగానూ, దర్శకుడిగానూ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ చూసిన ఘనత త్రివిక్రమ్ సొంతం. అలాంటి.. త్రివిక్రమ్ గీత రచయితగానూ తనలోని ప్రతిభని చాటుకున్నారు. అది కూడా ఒకే ఒక సినిమా కోసం. ఆ చిత్రమే.. `ఒక రాజు - ఒక రాణి`. మాస్ మహారాజా రవితేజ - నమిత టైటిల్ రోల్స్ లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా కోసం పూర్తి స్థాయి పాటల రచయితగా.. ఇందులోని ఆరు పాటలకూ సాహిత్యమందించారు త్రివిక్రమ్.
``స్వరాల వీణ``, ``వెన్నెలే నీవని``, ``కలలుకంటాను``, ``మన్నుతినే చిన్నతనం``, ``నిదురించే రాతిరిలో``, ``నా ప్రాణం నా గానం``.. ఇలా త్రివిక్రమ్ సాహిత్యంలో వికసించిన ఈ గీతమాలికకు స్వర్గీయ స్వరకర్త చక్రి వీనులవిందైన బాణీలు సమకూర్చారు. యోగి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. కాకపోతే, త్రివిక్రమ్ సాహిత్యమందించిన ఏకైక చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2003 జూన్ 19న విడుదలై రవితేజ అభిమానులను అలరించిన `ఒక రాజు - ఒక రాణి`.. నేటితో 18 వసంతాలను పూర్తిచేసుకుంది.