అఫిషియల్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్!
on Jun 18, 2021
టాలీవుడ్లోని టాప్ స్టార్స్తో సినిమాలు చెయ్యాలని ప్రయత్నించి విఫలమవుతూ వస్తోన్న శేఖర్ కమ్ముల ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అవును. ఆ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా నిర్మించనున్నట్లు శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా నిర్మాణమవుతుందని వారు తెలిపారు.
ఇప్పటికే తను చేసిన పాత్రల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ధనుష్ రెండు సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇటీవల 'కర్ణన్' మూవీలో టైటిల్ పాత్రలో ఆయన అభినయం మరోసారి అందరి ప్రశంసలూ అందుకుంది. దేశంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరిగా గుర్తింపు నోచుకున్న ధనుష్.. ఒక టాలీవుడ్ డైరెక్టర్గా పనిచేయడానికి అంగీకరించడం టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది.
తొలి చిత్రం 'డాలర్ డ్రీమ్స్'తో నేషనల్ అవార్డ్ పొందిన శేఖర్ కమ్ముల.. 'ఆనంద్' మూవీతో అందరి దృష్టిలో పడ్డారు. అనంతరం 'గోదావరి', 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఫిదా' లాంటి చిత్రాలతో డైరెక్టర్గా తనదైన ముద్ర వేశారు. పవన్ కల్యాణ్, మహేశ్బాబు లాంటి స్టార్స్తో పనిచేయాలని వారికి కథలు వినిపించినా అవి వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఆయన చెప్పిన స్టోరీ ధనుష్కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రానున్నదనే వార్త బయటకు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సెన్సిబుల్ డైరెక్టర్, ఒక బెస్ట్ యాక్టర్ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా కచ్చితంగా ఒక మరపురాని చిత్రాన్ని అందిస్తుందనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
శేఖర్ కమ్ముల ప్రస్తుతం 'లవ్ స్టోరీ' మూవీని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. మరోవైఫు ధనుష్ లేటెస్ట్ ఫిల్మ్ 'జగమే తంత్రమ్' ఈరోజు మధ్యాహ్నం నెట్ఫ్లిక్స్లో నేరుగా విడుదలవుతోంది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు.
Also Read