తెలంగాణ సీఎం నిధికి మహేశ్ విరాళం రూ. ఒక కోటి!
on Oct 20, 2020
వరదలు ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జన జీవితాన్ని కకావికలం చేశాయి. లోతట్టు ప్రాంతాల జనం బాధలు వర్ణనాతీతం. రోడ్లపైనే కాకుండా ఇళ్లల్లోకి నీరు వచ్చేసి జనం నిరాశ్రయులైన కథలెన్నో. బాధిత ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సాధ్యమైనంతగా విపత్తు సహాయ పనులను నిర్వహిస్తోంది. ఈ విపత్తు కాలంలో ప్రజలను ఆదుకోవడానికి టాలీవుడ్ కదులుతోంది. ఇప్పటికే నాగార్జున సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత ఎస్. రాధాకృష్ణ చెరొక రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.
తాజాగా సూపర్స్టార్ మహేశ్ ఏకంగా రూ. కోటి విరాళం సీఎం సహాయనిధికి ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. తెలంగాణలో అనూహ్యమైన వర్షపాతం వల్ల సంభవించిన వినాశనం మనం ఎప్పుడూ ఊహించిన దానికంటే దారుణంగా ఉంది. బాధిత కుటుంబాలకు సాధ్యమైనంతగా సాయపడేందుకు తెలంగాణ ప్రభుత్వం, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చేసిన కృషి అభినందనీయం. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి నా వంతుగా రూ. కోటి విరాళం ప్రకటిస్తున్నాను. ఈ విపత్తుకు సంబంధించి అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ క్లిష్ట కాలంలో మన ప్రజలకు అండగా నిలుద్దాం అని మహేశ్ పిలుపునిచ్చారు.
Also Read