చరణ్-శంకర్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కియారా
on Jul 31, 2021
మెగా పవర్స్టార్ రామ్చరణ్- సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపించాయి. ముఖ్యంగా కియారా అద్వానీ, ఆలియా భట్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఈ మూవీలో కియారా నటించనున్నట్లు తాజాగా మూవీ టీమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది.
మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా.. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయరామ'లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. రామ్ చరణ్ సరసన మరోసారి నటించనుంది. చరణ్-శంకర్ ల పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆమెకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది. శనివారం(జూలై 31) కియారా పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి కియారాకు స్వాగతం చెబుతూ ఓ ఫొటోని షేర్ చేసింది.
ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ.. "ఇప్పటి వరకు నా పుట్టినరోజుకి వచ్చిన గిఫ్ట్స్ లో ఇది బెస్ట్ బర్త్ డే గిఫ్ట్. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని అన్నారు.