జయలలితను రూ. 4 కోట్లకు మోసం చేసిన వ్యక్తెవరో తెలిసింది!
on Mar 6, 2021
ఒక వ్యక్తి తనను 4 కోట్ల రూపాయలకు మోసం చేశారని 'ఆలీతో సరదాగా' షోలో మాట్లాడుతూ సీనియర్ నటి జయలలిత కన్నీరు పెట్టుకోవడం సంచలనం కలిగించింది. ఆన్లైన్ వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో దీనికి చాలా ప్రచారం వచ్చింది. అయితే తనను మోసం చేసిన వ్యక్తి పేరును జయలలిత చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి ఎవరా అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి పేరును ఫైర్ బ్రాండ్ యాక్ట్రెస్గా పేరు పొందిన కరాటే కల్యాణి వెల్లడించారు. జయలలితను ఓదారుస్తూ పోస్ట్ పెట్టిన ఆమె, ఆ వ్యక్తి దొరుకుతాడనీ, అతడ్ని కుమ్మేద్దామనీ భరోసా ఇచ్చారు.
తన ఫేస్బుక్ హ్యాండిల్ ద్వారా స్పందించిన కల్యాణి, "జయక్కా నువ్వు ఎంత బాధ ఉన్నా నవ్వుతూనే ఉంటావు. అలాగే సిరిమల్లె లాగానే ఉండాలి.. అమ్మ ఇలా ఏడిస్తే మేము యేమైపోతము. వాడు ఆ అనిల్ రాజు, వాడి ఫ్యామిలీ దొరుకుతారు.. మనము కుమ్మేద్దాము.. నీకు.కష్టాలు తొందరలో పోవాలని కోరుకుంటున్నా. శ్రీరామ రక్ష. love u. ఇంకెప్పుడు ఏడవకు. నేను చూడలేను." అని రాసుకొచ్చారు.
దీనికి జయలలిత ప్రతిస్పందించారు. కల్యాణి పోస్ట్కు, "థ్యాంక్యూ తల్లీ.. ఎమోషనల్లో అలా ఐపోయా." అని కామెంట్ పెట్టారు.
'ఆలీతో సరదాగా' షోలో నటి వరలక్ష్మితో కలిసి పాల్గొన్న జయలలిత, "వాళ్లు విజయనగరం రాజులు.. జీఎస్టీలు కట్టలేకపోతున్నాం. సీరియల్స్ చేయడం కష్టంగా వుంది అంటే నేను వాళ్లని గుడ్డిగా నమ్మేశా. నా దగ్గర వున్న డబ్బుతో మీరు చేసుకోండి...నాకు షేర్ ఏమీ వద్దు అని చెప్పి వాళ్లకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టా.. అలా కొంత కాలం గడిచాక 2018 డిసెంబర్ నాటికి నాదగ్గర 4 కోట్లు వరకు డబ్బులు వసూలు చేసి వాడు చేతులెత్తేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు నేను కారు లేక క్యాబ్లలో తిరుగుతున్నాను. ఓ వ్యక్తిని నమ్మి మోసపోయాను." అని చెప్పి ఏడ్వడం అందరి హృదయాల్నీ తడి చేసింది.