కె. భాగ్యరాజ్, పూర్ణిమ దంపతులకు కరోనా
on May 7, 2021
సీనియర్ నటుడు-దర్శకుడు కె. భాగ్యరాజ్, ఆయన భార్య నటి పూర్ణిమా భాగ్యరాజ్ కొవిడ్-19 పాజిటివ్గా టెస్ట్లో నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని వారి కుమారుడు నటుడు శంతను భాగ్యరాజ్ ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేశాడు. డాక్టర్ల సూచన మేరకు తను, తన భార్య కికి, తమ స్టాఫ్ ఇంట్లోనే క్వారంటైన్లోకి వెళ్లినట్లు ఆ పోస్ట్లో వెల్లడించాడు. తమతో ఇటీవల కాంటాక్ట్ అయిన వాళ్లు కొవిడ్-19 టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరాడు.
శుక్రవారం శంతను తన ట్విట్టర్ హ్యాండిల్లో, "మా అమ్మాన్నలు కె. భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్ ఈరోజు కొవిడ్-19 పాజిటివ్గా టెస్ట్లో నిర్ధారణ అయ్యింది. సిబ్బంది సహా మేమందరం డాక్టర్ల సూచనల మేరకు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లాం. గత 10 రోజులుగా మమ్మల్ని కలిసిన వాళ్లందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మా అమ్మానాన్నలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి." అని రాసుకొచ్చాడు.
భాగ్యరాజ్ దంపతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు కోలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా తమ సందేశాలు తెలియజేశారు. భాగ్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన అనేక తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలాగే ఆయన భార్య తెలుగులో 'మంత్రిగారి వియ్యంకుడు' సినిమాలో చిరంజీవి సరసన నాయికగా నటించారు.