మొన్న విజయ్.. నేడు ధనుష్.. హైకోర్టు చివాట్లు
on Aug 5, 2021
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లగ్జరీ కారు కొనుగోలు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని తీర్పునిచ్చిన కోర్టు.. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు సెలబ్రిటీలకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది.
2015లో ధనుష్ ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. విదేశాల నుంచి ఆ కారుని దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన అదే ఏడాది కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. పన్ను చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారని నిలదీసింది. దాంతో ధనుష్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇప్పటికే 50 శాతం పన్ను చెల్లించామని, మిగతా మొత్తాన్ని ఈ నెల 9న చెల్లిస్తామని సమాధానమిచ్చారు.
మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు సైతం ఇటీవల కోర్టులో ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి ఖరీదైన కారుని దిగుమతి చేసుకొని.. పన్ను మినహాయింపు కోరడంపై సీరియస్ అయింది. అంతేకాదు పన్ను కట్టనందుకు విజయ్ కు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
Also Read