మహేశ్, ప్రభాస్ కంటే ముందే పవన్?
on Aug 2, 2021
2022 సంక్రాంతి రసవత్తర పోటీకి వేదికగా నిలవనుంది. ఏకంగా ఐదుగురు స్టార్ హీరోల సినిమాలు వచ్చే ఏడాది పొంగల్ బరిలో దిగబోతున్నాయి. ఆ ఐదు చిత్రాలే.. `రాధే శ్యామ్`, `సర్కారు వారి పాట`, `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్, `ఎఫ్ 3`, `బంగార్రాజు`. వీటిలో `రాధే శ్యామ్`, `సర్కారు వారి పాట`, `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రాలు సంక్రాంతికి రాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ఇక `ఎఫ్ 3` కూడా ముగ్గుల పండక్కే రాబోతున్నట్లు `నారప్ప` సక్సెస్ మీట్ లో విక్టరీ వెంకటేశ్ వెల్లడించారు. త్వరలో పట్టాలెక్కనున్న `బంగార్రాజు` కూడా సంక్రాంతి సీజన్ నే టార్గెట్ చేసుకుంది. ఆ సినిమా ఎప్పుడు మొదలైనా.. సంక్రాంతికే వస్తుందని కింగ్ నాగార్జున ఇప్పటికే సెలవిచ్చారు. సో.. ఈ ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ 2022 సంక్రాంతికి ఖాయమనే అనుకోవాలి.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న `సర్కారు వారి పాట` జనవరి 13న రాబోతుండగా.. ఆ తరువాతి రోజు అంటే జనవరి 14న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `రాధే శ్యామ్` రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రిలీజ్ డేట్ పై ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మహేశ్, ప్రభాస్ కంటే ముందే పవన్ సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. జనవరి 12న పవన్ సినిమా రాబోతోందని తెలిసింది. ఇక 15, 16 తేదీల్లో `ఎఫ్ 3`, `బంగార్రాజు` రిలీజ్ కావచ్చని టాక్. మొత్తమ్మీద.. 2022 సంక్రాంతికి వరుసగా ఐదు రోజుల పాటు ఐదుగురు స్టార్ హీరోల సినిమాలు సందడి చేసే అవకాశముందన్నమాట. మరి.. చివరాఖరికి ఏయే చిత్రాలు బరిలో నిలుస్తాయో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read