మహేశ్, బన్నీపై పోటీకి దిగుతున్న కల్యాణ్రామ్
on Sep 22, 2019
మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ మూవీ 'అల.. వైకుంఠపురములో..' 2020 సంక్రాంతికి విడుదలవుతున్నట్లు ఇప్పటికే వాటి నిర్మాతలు ప్రకటించారు. దాంతో మహేశ్, బన్నీ మధ్య సంక్రాంతి పోటీ అనివార్యమయింది. తాజాగా మరో హీరో కూడా వాళ్ళతో పోటీ పడేందుకు సై అంటున్నాడు. అతను నందమూరి కల్యాణ్రామ్. అవును. అతను హీరోగా నటిస్తోన్న 'ఎంత మంచివాడవురా' సినిమాను 2020 జనవరి 15న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
కల్యాణ్రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ సంస్థ భారీగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులు. 'శతమానం భవతి'తో జాతీయ పురస్కారం అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మెహరీన్ కథానాయిక.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఉమేష్ గుప్తా, చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ "ఆగస్టు 26 నుంచి రాజమండ్రి, పెండ్యాల, పురుషోత్తమపట్నం, వంగలపూడి, తొర్రేడు, కొవ్వూరు, కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 25 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఏకధాటిగా జరుగుతున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. తొర్రేడులో రూ. 35 లక్షల వ్యయంతో భారీ జాతర సెట్ వేశాం. అక్కడ కల్యాణ్రామ్, నటాషా దోషి ('జై సింహా' ఫేమ్)పై ఒక సాంగ్ షూట్ చేశాం. ఈ చిత్రీకరణలో 50 మంది డ్యాన్సర్లు, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అలాగే పెండ్యాలలోని ఇసుక ర్యాంపుల మధ్య భారీ ఎత్తున తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. వంగలపూడి సమీపంలో గోదావరిలో 16 బోట్లతో తెరకెక్కించిన ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ అల్టిమేట్గా ఉంటుంది. జనవరి 15న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం" అని చెప్పారు.
దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ "రాజమండ్రి పరిసరాల్లోని అందాలను మా 'ఎంత మంచివాడవురా'లో మరోసారి చూపించబోతున్నాం. అక్టోబర్ 9 నుంచి 22 వరకూ హైదరాబాద్లో మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత కేరళ, కర్ణాటకల్లో జరిగే నాలుగో షెద్యూల్లో కొన్ని ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది" అని తెలిపాడు.
వి.కె. నరేశ్, సుహాసిని, శరత్బాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెలకిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: రామాంజనేయులు, రచన-దర్శకత్వం: సతీశ్ వేగేశ్న.
Also Read