నాకు కరోనా వచ్చింది నిజమే!
on Apr 5, 2021
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు కొవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని తెలుగువన్ సహా కొన్ని ఆన్లైన్ పోర్టల్స్లో న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదని కూడా తెలుగువన్ వెల్లడించింది. తాజాగా అల్లు అరవింద్ తనకు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని నిర్ధారించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
ఆ వీడియోలో అరవింద్ మాట్లాడుతూ, "నాకు కరోనా వచ్చిందని వార్తలు వచ్చాయి. అవును.. నాకు వచ్చిన మాట నిజమే. కానీ రెండు వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత కూడా కరోనా వచ్చిందనడం మాత్రం నిజం కాదు. నేను ఓ డోస్ మాత్రమే వేయించుకున్నాను. అసలు విషయం ఏంటంటే.. మేం ముగ్గురం స్నేహితులం కలిసి ఊరెళ్లొచ్చాం. అప్పుడే కరోనా వచ్చింది. మా ముగ్గురిలో ఇద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. నాకు మూడు రోజులు లైట్గా జ్వరం వచ్చి తగ్గిపోయింది. వ్యాక్సిన్ తీసుకోని స్నేహితుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా మంచిది అనేదానికి నేనే నిదర్శనం." అని ఆయన వివరించారు.
వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా వస్తుందంట కదా.. అంటే వస్తుంది కానీ చాలా లైట్గా వచ్చి వెళ్లిపోతుందని ఆయన తెలిపారు. "అందుకే తప్పకుండా అంతా వ్యాక్సిన్ వేయించుకోండి. కొన్నిసార్లు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వచ్చినా.. వచ్చెళ్లిపోతుందంతే కానీ ప్రాణహాని ఉండదు. నా స్నేహితుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. నేను వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా లైట్గానే ఉంది. అందుకే తప్పకుండా అంతా వ్యాక్సిన్ వేయించుకోండి." అంటూ చెప్పుకొచ్చారు అరవింద్.
Also Read