బాలయ్య-బోయపాటి కాంబో.. 'అఖండ'తో హ్యాట్రిక్ సిల్వర్ జూబ్లీ
on May 25, 2022
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబో ఒకటి. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'సింహా' 2010 ఏప్రిల్ 30న విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. చాలా కాలంగా విజయ వేటలో ఉన్న బాలయ్య ఈ సినిమాతో సింహంలా గర్జించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇలా కదా మా హీరోని చూపించాల్సింది అంటూ బాలయ్య ఫ్యాన్స్ సంబరపడ్డారు. అలా మొదటి సినిమాతోనే బాలయ్య-బోయపాటి కాంబోకి క్రేజ్ వచ్చింది. నాలుగేళ్ళ తర్వాత 2014 మార్చి 28న వీరి కాంబోలో వచ్చిన రెండో సినిమా 'లెజెండ్'.. సింహాను మించిన కలెక్షన్స్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా 'అఖండ' 2021 డిసెంబర్ 2 న విడుదలై సెకండ్ లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టేలా చేసి అఖండ విజయాన్ని సాధించి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది.
ఈ రోజుల్లో సినిమాలు రెండు మూడు వారాలు ఆడితే గొప్ప అన్నట్లుగా తయారైంది. హిట్ అయితే రెండు వారాల్లో కలెక్షన్స్ రాబట్టాలి, ప్లాప్ అయితే రెండు రోజులకి దుకాణం సర్దేయాలి అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితికి బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అతీతం. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు కలెక్షన్స్ కొల్లగొట్టడంతో పాటు సిల్వర్ జూబ్లీ సినిమాలు గానూ నిలుస్తున్నాయి. 'సింహా', 'లెజెండ్' సినిమాలు 175 రోజులకి పైగా ఆడి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు 'అఖండ' కూడా వాటి సరసన చేరింది. చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో అఖండ సినిమా 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈరోజుల్లో హ్యాట్రిక్ సిల్వర్ జూబ్లీ అందుకోవడం విశేషమనే చెప్పాలి.
ఇదిలా ఉంటే బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన రెండో సినిమా 'లెజెండ్' మూవీ ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్ లో 1000 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. మున్ముందు 'అఖండ' కూడా అలాంటి సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.