'పుష్ప' నుంచి 'శ్రీవల్లి' సాంగ్ వచ్చేసింది.. తగ్గేదేలే!
on Oct 13, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'పుష్ప'. ఇందులో పుష్ప రాజ్ గా బన్నీ, శ్రీవల్లిగా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా పుష్ప నుంచి సెకండ్ సాంగ్ విడుదలైంది. శ్రీవల్లిని ఉద్దేశించి పుష్ప రాజ్ పాడే ఈ 'శ్రీవల్లి' పాట ఆకట్టుకుంటోంది. లిరికల్ వీడియోలో పుష్ప రాజ్ గా బన్నీ లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకున్నాయి.
'నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తుంటావే' అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. 'కనిపించని దేవుడినే కన్నార్పక చూస్తావే.. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే' వంటి లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. దేవీ వినసొంపైన సంగీతం, చంద్రబోస్ అర్థవంతమైన సాహిత్యం ఈ పాటకు అందాన్ని తెచ్చాయి. సుకుమార్ గత చిత్రం 'రంగస్థలం'లో దేవీ-చంద్రబోస్ కాంబినేషన్ లో వచ్చిన 'ఎంత సక్కగున్నావే' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో 'శ్రీవల్లి' సాంగ్ కూడా అంత హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక సాంగ్ కు సిద్ శ్రీరామ్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవిశ్రీప్రసాద్-చంద్రబోస్-సిద్ శ్రీరామ్ 'శ్రీవల్లి' సాంగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న పుష్ప మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read