పండగలనే లక్ష్యం చేసుకున్న `సితార`!
on Sep 25, 2021
వైవిద్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ కి అనుబంధ సంస్థ అయిన సితార.. `ప్రేమమ్`, `జెర్సీ`, `భీష్మ` వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగునాట తనదైన ముద్రవేసింది. త్వరలో మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలతో ఎంటర్టైన్ చేయనుంది సితార.
ఇదిలా ఉంటే.. `భీష్మ` చిత్రం నుంచి తమ సంస్థ నుంచి వస్తున్న వరుస చిత్రాలకు పండగలనే లక్ష్యంగా చేసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది సితార. ఆ వివరాల్లోకి వెళితే.. 2020 మహాశివరాత్రి కానుకగా `భీష్మ` విడుదలైతే.. గత చిత్రం `రంగ్ దే` 2021 హోలీ స్పెషల్ గా సందడి చేసింది. అంతేకాదు.. త్వరలో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి `వరుడు కావలెను`, `జెర్సీ` (హిందీ), `భీమ్లా నాయక్` రాబోతుండగా.. ఇవి కూడా ఫెస్టివల్ సీజన్స్ నే టార్గెట్ చేసుకోవడం విశేషం. దసరా కానుకగా `వరుడు కావలెను` రిలీజ్ కానుండగా.. దీపావళి సీజన్ లో హిందీ `జెర్సీ` విడుదల కానుంది. ఇక 2022 సంక్రాంతి సమయంలో `భీమ్లా నాయక్` జనం ముందుకు రానుంది. మరి.. ఈ ఫెస్టివల్ స్పెషల్ మూవీస్ తో సితార సంస్థ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.