`శ్యామ్ సింగ రాయ్`.. స్టోరీ లైన్ అదేనా?
on Mar 1, 2021
నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నాయికలుగా దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్టోరీ లైన్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 1960ల నాటి కాలానికి చెందిన బెంగాలీ యువకుడిగా నాని కనిపించబోతున్నాడట. సాయిపల్లవి పాత్రతో అతని ప్రేమాయణం ఎలాంటి తీరాలకు చేరింది? మరు జన్మలో తెలుగు కుర్రాడిగా పుట్టిన నాని.. తన పునర్జన్మకి సంబంధించి చేసిన శోధనలో ఎలాంటి విషయాలు తెలిశాయి? అనే అంశాల చుట్టూ `శ్యామ్ సింగ రాయ్` తిరుగుతుందట. ఇక ఈ జన్మలో అతని ప్రేయసిగా కృతి శెట్టి కనిపిస్తుందట. మడోన్నాది రెండు జన్మాలతో ముడిపడిన పాత్రని వినికిడి.
మరి.. `శ్యామ్ సింగ రాయ్` స్టోరీ లైన్ పై వస్తున్న కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. మిక్కీ జే మేయర్ ఈ పిరియడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి బాణీలు అందిస్తున్నాడు.