తారక్ హీరోయిజానికి 21 ఏళ్ళు!
on May 25, 2022
ఈ తరం కథానాయకుల్లో `ఆల్ రౌండర్`గా ప్రత్యేక గుర్తింపు పొందారు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అలాంటి తారక్ కి మే 25 ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. 21 ఏళ్ళ క్రితం అంటే 2001లో ఇదే రోజున ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా `నిన్ను చూడాలని` జనం ముందు నిలిచింది. దిగ్గజ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని.. `నువ్వు వస్తావని` (2000) వంటి సెన్సేషనల్ హిట్ తో దర్శకుడిగా పరిచయమైన వీఆర్ ప్రతాప్ రూపొందించారు. ఇందులో తారక్ కి జోడీగా నూతన కథానాయిక రవీనా రాజ్ పుత్ నటించగా.. కె. విశ్వనాథ్, కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, రాళ్ళపల్లి, సుధ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
మెలోడీ స్పెషలిస్ట్ ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి, `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, చంద్రబోస్ సాహిత్యమందించారు. ``ఊపిరొచ్చిన బాపు బొమ్మ``, ``ఏ చోట నేనున్నా``, ``ఎన్నాళ్ళో వేచాక``, ``ముద్దబంతి పువ్వమ్మో``, ``ఏమైందో ఏమోగానీ``, ``క్యాంపస్ లో కాలెట్టి``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. 2001 మే 25న విడుదలైన `నిన్ను చూడాలని` బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించనప్పటికీ.. ఎన్టీఆర్ కి నటుడిగా మంచి గుర్తింపునే తీసుకువచ్చింది. కాగా, నేటితో తారక్ హీరోయిజానికి 21 ఏళ్ళు పూర్తయ్యాయి.
Also Read