`లూసిఫర్` రీమేక్ కి ముహూర్తం ఫిక్స్
on Jul 26, 2021
మాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన `లూసిఫర్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్రీకరణకి ముహూర్తం ఫిక్స్ అయిందని టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఆగస్టు 12 నుంచి `లూసిఫర్` రీమేక్ తాలూకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ నేతృత్వంలో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయని సమాచారం. మరి.. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పొలిటికల్ థ్రిల్లర్.. తెలుగులోనూ అదే బాట పడుతుందేమో చూడాలి.
కాగా, చిరంజీవి తాజా చిత్రం `ఆచార్య` తుది దశకు చేరుకుంది. రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాని కొరటాల శివ రూపొందిస్తున్నారు. ఇందులో చిరుకి జోడీగా కాజల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే దర్శనమివ్వనున్నారు.