'డియర్ కామ్రేడ్' సంచలనం.. విజయ్-రష్మికల క్రేజే వేరు!
on Jun 18, 2021
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్-రష్మిక కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో 'డియర్ కామ్రేడ్'పై విడుదలకు ముందు భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించ గలిగింది. పాటలు, కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'డియర్ కామ్రేడ్'ను హిందీలోకి డబ్ చేసి గత ఏడాది జనవరిలో గోల్డ్ మైన్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. విడుదలై ఏడాదిన్నర తిరక్కుండానే డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్ 250 మిలియన్ల మార్కును క్రాస్ చేసింది. అలాగే దాదాపు 3 మిలయన్ లైక్స్ సంపాదించింది. మామూలుగా హిందీ లోకి డబ్ అయ్యే తెలుగు మాస్ మసాలా సినిమాలకి భారీగా వ్యూస్ వస్తుంటాయి. అయితే 'డియర్ కామ్రేడ్' వంటి క్లాస్ మూవీని హిందీలో డబ్ చేయగా 250 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషమనే చెప్పాలి.
విజయ్, రష్మికలకు నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2020 లిస్టులో నేషనల్ వైడ్ గా రెండో స్థానాన్ని దక్కించుకోగా.. రష్మిక నేషనల్ క్రష్ గా క్రేజ్ సంపాదించుకుంది. విజయ్-రష్మికల క్రేజే 'డియర్ కామ్రేడ్' హిందీ వెర్షన్ కి 250 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చేలా చేసిందని చెప్పవచ్చు.