అప్పుడు `గోపాల గోపాల`.. ఇప్పుడు `దృశ్యం 2`..
on Mar 2, 2021
యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. మాలీవుడ్ సెన్సేషన్ `దృశ్యం 2`కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రం రూపంలో ఆ అవకాశం దక్కింది. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ లో తనకు ఇది రెండో సినిమా కావడం విశేషం.
గతంలో వెంకీ, అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో `గోపాల గోపాల` మూవీ వచ్చింది. హిందీలో విజయం సాధించిన `ఓ మై గాడ్`కి రీమేక్ గా `గోపాల గోపాల` రూపొందిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ఆరేళ్ళ గ్యాప్ తరువాత వెంకీతో అనూప్ జట్టుకడుతున్న `దృశ్యం 2` కూడా రీమేక్ నే కావడం గమనార్హం. మొత్తమ్మీద.. వెంకీతో అనూప్ రూబెన్స్ రీమేక్ మూవీస్ కోసమే కలిసి పనిచేస్తుండడం వార్తల్లో నిలుస్తోంది. కాగా, `దృశ్యం` తెలుగు వెర్షన్ కి శరత్ సంగీతమందించారు.
ఇదిలా ఉంటే.. పూజా కార్యక్రమాలతో మార్చి 1న మొదలైన `దృశ్యం 2` తెలుగు వెర్షన్.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ నే ఈ రీమేక్ కి కూడా దర్శకుడు. ఇక ఒరిజనల్ వెర్షన్ లో నటించిన మీనా.. తెలుగులోనూ అదే పాత్రలో కనిపించనున్నారని టాక్.
Also Read