టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ముమైత్ ఖాన్ పై ఈడీ ప్రశ్నల వర్షం!
on Sep 15, 2021
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ(ఈడీ) కొనసాగుతోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా దగ్గుబాటి, రవితేజ, నవదీప్ లను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. బుధవారం ముమైత్ ఖాన్ ను విచారించారు.
ముమైత్ ఖాన్ బుధవారం ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు జరిగిన విచారణలో.. ఈడీ అధికారులు ముమైత్ పై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. ముమైత్ బ్యాంకు ఖాతాలను పరిశీలించి అధికారులు.. ఆమెకు ముంబయిలో రెండు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే గతంలో ఆమె జరిపిన అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. డ్రగ్స్ విక్రేత కెల్విన్తో ఉన్న సంబంధాలు.. ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీలు, నగదు లావాదేవీలపై ముమైత్ ను అధికారులు ప్రశ్నించారు.
కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈడీ కస్టడీలో ఉన్నాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు.. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. ఇప్పటికే పలువురుని ప్రశ్నించారు.