'భీమ్లా నాయక్'కి పోటీగా శర్వానంద్-రష్మిక మూవీ!
on Jan 28, 2022
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్స్ లో విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'భీమ్లా నాయక్' కూడా ఫిబ్రవరి 25 నే విడుదల కానుంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన చిరంజీవి 'ఆచార్య' సహా పలు సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో 'భీమ్లా నాయక్' విడుదలపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మూవీ టీమ్ నుంచి మాత్రం వాయిదా ప్రకటన రాలేదు. మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి యూఎస్ ప్రీమియర్స్ అంటూ వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఫిబ్రవరి 25న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. 'భీమ్లా నాయక్' వాయిదా పడుతుందన్న క్లారిటీతో మేకర్స్ ఈ ప్రకటన చేశారో, లేక సినిమాపై నమ్మకంతో అదే తేదికి విడుదల చేస్తున్నారో తెలియాల్సి ఉంది. గతంలో 'శతమానంభవతి', 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి సినిమాలను పెద్ద సినిమాలకు పోటీగా విడుదల చేసి శర్వానంద్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరోసారి శర్వానంద్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
ఈ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also Read