మ్యూజికల్ బ్లాక్ బస్టర్ `ఆనందం`కి 20 ఏళ్ళు!
on Sep 28, 2021
వైవిద్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన నిర్మాణ సంస్థ.. ఉషాకిరణ్ మూవీస్. కేవలం ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలకే పరిమితం కాకుండా.. అప్పుడప్పుడు యువతరాన్ని అలరించే ప్రయత్నం కూడా చేసిందీ దిగ్గజ సంస్థ. అందులో భాగంగానే.. `చిత్రం`, `నువ్వే కావాలి`(2000), `ఆనందం`(2001) చిత్రాలతో మురిపించింది. వీటిలో మూడో సినిమా అయిన `ఆనందం` విడుదలై.. నేటికి (సెప్టెంబర్ 28) సరిగ్గా 20 ఏళ్ళు. ఈ సందర్భంగా `ఆనందం` జ్ఞాపకాల్లోకి వెళితే..
* `నీ కోసం` (1999)తో దర్శకుడైన శ్రీనువైట్లకి `ఆనందం` రెండో చిత్రం. ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని స్పృశిస్తూ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. టార్గెట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. ఇందులో జంటగా నటించిన ఆకాశ్, రేఖకి మంచి గుర్తింపు దక్కింది.
* రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని యువతరానికి చేరువచేసిన సినిమా `ఆనందం`. అప్పటికే `దేవి` (1999) వంటి బ్లాక్ బస్టర్ ఉన్నా.. `ఆనందం`లోని పాటలన్నీ కుర్రకారుని ఫిదా చేశాయి. మరీముఖ్యంగా.. ``కనులు తెరిచినా కనులు మూసినా`` అంటూ సాగే యుగళ గీతం ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది.
* శ్రీనువైట్ల తొలి చిత్రం `నీకోసం`లో ఓ పాటకు బాణీ అందించిన డీఎస్పీ.. పూర్తిస్థాయిలో చేసిన తొలి చిత్రమిదే. ఆపై శ్రీను వైట్ల - దేవి శ్రీ కాంబినేషన్ లో `సొంతం` (2002), `వెంకీ` (2004), `అందరివాడు` (2005), `రెడీ` (2008), `కింగ్` (2008), `నమో వెంకటేశ` (2010) వంటి సినిమాలు వచ్చాయి.
* `ఆనందం` తరువాత ఇదే ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో `ఆనందమానందమాయే` (2004) చిత్రంచేశారు శ్రీను వైట్ల. ఇందులోనూ ఆకాశ్ హీరోగా నటించాడు.
* `ఆనందం` చిత్రాన్ని తమిళంలో `ఇనిదు ఇనిదు కాదల్ ఇనిదు`, కన్నడంలో `ఆనంద` పేర్లతో ఉషాకిరణ్ మూవీస్ సంస్థనే రీమేక్ చేసింది.
* మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన `ఆనందం` 200కి పైగా రోజులు ప్రదర్శితమైంది.
Also Read