రవితేజ - పూరి ఫస్ట్ కాంబో మూవీ `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`కి 20 ఏళ్ళు!
on Sep 14, 2021
మాస్ మహరాజా రవితేజ - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ఐదు చిత్రాలు రాగా.. వాటిలో మొదటి మూడు సినిమాలు (ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి) మంచి విజయం సాధించాయి. వీరిద్దరి కాంబోలో తొలి చిత్రమైన `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` రవితేజ కెరీర్ లో తొలి సూపర్ హిట్ గా నిలవగా.. రెండో సినిమా `ఇడియట్` ఇద్దరికీ స్టార్ డమ్ ని తీసుకొచ్చింది. ఇక మూడో చిత్రం `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` కూడా విజయపరంపరని కొనసాగించి.. రవితేజ - పూరి ద్వయంని హ్యాట్రిక్ కాంబోగా నిలిపింది.
కాగా, రవితేజ - పూరి జట్టుకట్టిన తొలి చిత్రం `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` విడుదలై నేటికి 20 ఏళ్ళు. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాల్లోకి వెళితే.. వేర్వేరు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అపరిచితులు సుబ్రమణ్యం, శ్రావణి.. ఆ ఆలోచనను విరమించుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుడతారు. ఈ నేపథ్యంలో వారికి ఎదురయ్యే పరిస్థితులేంటి? చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ రొమాంటిక్ డ్రామా స్టోరీ లైన్. ఇందులో సుబ్రమణ్యంగా రవితేజ నటించగా.. శ్రావణిగా తనూ రాయ్ కనిపించింది. ఇతర ముఖ్య పాత్రల్లో సమ్రీన్, అనంత్ బాబు, అన్నపూర్ణ, తనికెళ్ళ భరణి, ఎల్బీ శ్రీరామ్, కల్పనా రాయ్, ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, జీవా, చిన్నా, రఘు కుంచె, జీవీ సుధాకర్ నాయుడు, ప్రసన్న అలరించారు. కె. వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక చక్రి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``మళ్ళీ కూయవే`` చార్ట్ బస్టర్ గా నిలిచింది. `ఉత్తమ కథా రచయిత`గా పూరికి `నంది` పురస్కారాన్ని అందించిన ఈ చిత్రం.. తమిళంలో `తవమ్` (2007) పేరుతో రీమేక్ అయింది. 2001 సెప్టెంబర్ 14న విడుదలై జననీరాజనాలు అందుకున్న `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.