పదహారేళ్ళ `గోదావరి`!
on May 19, 2022
టాలీవుడ్ లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు.. దర్శకుడు శేఖర్ కమ్ముల. `ఆనంద్` (2004) వంటి ప్రజారంజక చిత్రం తరువాత శేఖర్ నుంచి వచ్చిన `గోదావరి`(2006) కూడా అచ్చంగా ఆ తరహా సినిమానే. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు - దిగ్గజ దర్శకుడు బాపు కలయికలో తెరకెక్కిన `అందాల రాముడు` (1973) స్ఫూర్తితో రూపొందిన `గోదావరి`లో ఏయన్నార్ మనవడు సుమంత్ హీరోగా నటించడం విశేషం. సుమంత్ కి జంటగా కమలిని ముఖర్జీ నటించిన ఈ సినిమాలో నీతూ చంద్ర, కమల్ కామరాజు, తనికెళ్ళ భరణి, కరాటే కళ్యాణి, సీవీఎల్ నరసింహారావు, మధుమణి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కేఎం రాధాకృష్ణన్ స్వరాలకు అనుగుణంగా దిగ్గజ రచయిత వేటూరి సాహిత్యమందించిన ఈ చిత్రంలో.. ``ఉప్పొంగెలే గోదావరి``, ``అందంగా లేనా``, ``మనసా వాచా``, ``మనసా గెలుపు``, ``రామచక్కని``, ``టిప్పులు టిప్పులు`` అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. `ద్వితీయ ఉత్తమ చిత్రం`, `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` (విజయ్ సి. కుమార్), `ఉత్తమ గాయని` (సునీత - అందంగా లేనా) విభాగాల్లో `నంది` పురస్కారాలను సొంతం చేసుకున్న `గోదావరి`ని జీవీజీ రాజు నిర్మించారు. కాగా, 2006 మే 19న విడుదలై విజయం సాధించిన `గోదావరి`.. నేటితో 16 వసంతాలను పూర్తిచేసుకుంది.