'కార్తీక దీపం' సీరియల్లో కథ మరో కీలక మలుపు తీసుకుంది. కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క దంపతులను, వాళ్ళ కుటుంబాన్ని జైల్లో ఉండి ముప్పు తిప్పలు పెడుతున్న మోనితకు పెరోల్ లభించింది. దాంతో జైలు నుండి విడుదలకు రెడీ. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
మోనిత కారణంగా ఏర్పడుతున్న మానసిక క్షోభ నుండి దూరం కావాలని భార్యాపిల్లలతో అమెరికా వెళ్ళడానికి కార్తీక్ రెడీ అవుతాడు. విదేశీ ప్రయాణానికి అంతా సిద్ధమైంది. అయితే, ఈలోపు కార్తీక్ ఫ్యామిలీకి అనుకోని షాక్ తగిలింది. 'వింత ప్రేమికురాలు మోనిత విడుదల' శీర్షికతో మోనిత జైలు నుండి విడుదలువుతున్న వార్తను కార్తీక్ తల్లి సౌందర్య చూస్తుంది.
అదే వార్తను చూసిన దీప 'సరిగ్గా ఈ రోజే బయటకు రావాలా?' అని బాధ పడుతుంది. పిల్లలకు ఆ పేపర్ కనిపించకుండా దాచేద్దామని శ్రావ్య అంటే... పిల్లల్ని పిలిచి మరీ ఆ వార్తను చూపిస్తుంది దీప. అందరూ షాక్ అవుతారు. ఈ షాక్ గురించి కాకుండా... జైల్లో నుండి ఎన్నో చేసిన మోనిత, ఇప్పుడు బయటకు వస్తే ఇంకేం చేస్తుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. త్వరలో మోనిత విడుదలయ్యే దృశ్యాలు సీరియల్ లో ప్రసారం కానున్నాయి.