భరతనాట్యం డాన్సర్గా, నటిగా సుధా చంద్రన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. రామోజీరావు నిర్మించిన తన బయోపిక్ 'మయూరి'లో హీరోయిన్గా తనే నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేశారు. ఆ తర్వాత హిందీ చిత్రసీమలోనూ అడుగుపెట్టి, అక్కడా మంచి పేరు తెచ్చుకున్నారు. తన జీవితంలోని విషాదాన్ని ధైర్యంతో, పట్టుదలతో, దీక్షతో అధిగమించి ఒక సెలబ్రిటీగా ఎదిగిన వైనం ఎవరికైనా మార్గదర్శకం.
1981లో, పదహారేళ్ల పరువంలో ఒక యాక్సిడెంట్లో ఆమె రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. కుడికాలు దెబ్బతినడంతో దాన్ని తీసేయాల్సి వచ్చింది. జైపూర్ కృత్రిమకాలు సాయంతో ధైర్యాన్ని కూడదీసుకున్నారు సుధ. రెండేళ్ల తర్వాత తిరిగి డాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించి, మంచి డాన్సర్గానే కాకుండా, దేశంలోని చక్కని నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకోవడమంటే మాటలా!
అలాంటి గొప్ప వ్యక్తి విమాన ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడల్లా అధికారుల తీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. గురువారం తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె ఓ వీడియో షేర్ చేశారు. తనకు సీనియర్ సిటిజన్ కార్డును మంజూరు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్ సందర్భంగా ప్రతిసారీ తన కృత్రిమ కాలును తొలగించి చూపాల్సి వస్తోందని ఆమె బాధపడ్డారు. ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన ఆ వీడియోలో, ప్రతిసారీ ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్ సందర్భంగా తనెంత ఇబ్బందులు గురవుతున్నదో, ఎంత నరకం అనుభవిస్తున్నదో చెప్పారు.
కృత్రిమ కాలుతోటే దేశం గర్వించదగ్గ డాన్సర్గా, యాక్టర్గా పేరుపొందిన ఆమె, ఆ వీడియోలో తనను తాను ఒక యాక్టర్గా, డాన్సర్గా పరిచయం చేసుకున్నారు. "ఈటీడీ (ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్) పరీక్షలు చేయండి కానీ, ప్రతిసారీ తన కృత్రిమ కాలును తొలగించి చూపాల్సి రావడం బాధాకరంగా ఉంద"ని సీఐఎస్ఎఫ్ అధికారులను ఉద్దేశించి తెలిపారు. ఆ వీడియోకు, "టోటల్లీ హర్ట్.. ప్రతిసారీ దీన్ని ఎదుర్కోవడం చాలా చాలా బాధ కలిగిస్తోంది.. నా మెసేజ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులకు చేరుతుందని ఆశిస్తున్నాను. తగిన చర్యలు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను" అని కాప్షన్ పెట్టారు సుధా చంద్రన్. ఆమె బాధను అధికారులు అర్థం చేసుకుంటారో, లేదో చూడాలి.