స్వరమాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడిగా స్వరంగేట్రం చేసినా.. అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్. కేవలం స్వరకర్తగానే పరిమితం కాకుండా నటుడిగానూ తనదైన ముద్రవేస్తున్నాడు ప్రకాశ్. `రాజా రాణి`, `తెరి`, `అసురన్` తదితర చిత్రాలతో తమిళనాట స్టార్ కంపోజర్ గా పేరు తెచ్చుకున్న జీవీ ప్రకాశ్.. తెలుగులోనూ కొన్ని సినిమాలకు బాణీలు అందించాడు. `ఉల్లాసంగా.. ఉత్సాహంగా..`, `డార్లింగ్`, `ఎందుకంటే.. ప్రేమంట!`, `ఒంగోలు గిత్త`, `జెండాపై కపిరాజు` వంటి టాలీవుడ్ ప్రాజెక్ట్స్ కి ప్రకాశ్ స్వరాలు సమకూర్చారు.
ఇదిలా ఉంటే.. ఆరేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం జీవీ ప్రకాశ్ మరో తెలుగు సినిమాకి సంగీతమందించనున్నాడని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి జీవీ ప్రకాశ్ సంగీత దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్. త్వరలోనే రవితేజ - త్రినాథరావు నక్కిన కాంబో మూవీలో జీవీ ప్రకాశ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. తెలుగునాట ఆరంభంలో మంచి విజయాలే చూసిన జీవీ ప్రకాశ్.. కమ్ బ్యాక్ ఫిల్మ్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.