`ఇచ్చట వాహనములు నిలుపరాదు` చిత్రంతో తెలుగు తెరకు నాయికగా పరిచయమైంది మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరి. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజకి జోడీగా `ఖిలాడి` చిత్రంలో నటిస్తోంది. ఇందులో డింపుల్ హయాతి మరో నాయికగా దర్శనమివ్వనుంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `ఖిలాడి` విడుదలకు ముందే మరో రెండు బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో నటించే ఛాన్స్ దక్కించుకుందట మీనాక్షి చౌదరి. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే ప్రధాన నాయికగా నటిస్తుండగా.. సెకండ్ లీడ్ గా మీనాక్షి ఎంపికైందట. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇందులో శ్రుతి హాసన్ మెయిన్ లీడ్ గా నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి కనిపించనుందని టాక్.
మరి.. రవితేజ, మహేశ్, ప్రభాస్ ఇలా వరుసగా అగ్ర కథానాయకులతో నటించే అవకాశం దక్కించుకున్న మీనాక్షి.. ఆయా చిత్రాలతో ఎలాంటి గుర్తింపుని దక్కించుకుంటుందో చూడాలి.