1971 సంవత్సరం నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి ఎంతో ప్రత్యేకం. ఆ ఏడాది సంక్రాంతికి విడుదలైన `దసరా బుల్లోడు` ఆ యేటి హయ్యస్ట్ గ్రాసర్ గా నిలవగా.. అదే సంవత్సరం సెప్టెంబర్ 24న జనం ముందుకొచ్చిన `ప్రేమనగర్` సెకండ్ హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల్లోనూ ఏయన్నార్ కి జంటగా కళాభినేత్రి వాణిశ్రీ నటించడం విశేషం. అంతేకాదు.. ఈ రెండు చిత్రాలకూ ఆచార్య ఆత్రేయ మాటలు, పాటలు అందించగా - స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలు సమకూర్చారు. అలాగే ఎస్. వెంకటరత్నం ఛాయాగ్రహణం అందించారు. వీటిలో ఆల్ - టైమ్ క్లాసిక్ గా నిలిచిన `ప్రేమనగర్` నేటితో 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
* కోడూరి కౌసల్యా దేవి రచించిన `ప్రేమనగర్` నవల ఆధారంగా `ప్రేమనగర్` చిత్రం తెరకెక్కింది. వ్యసనపరుడు, స్త్రీ లోలుడు అయిన పెద్దింటి అబ్బాయి కళ్యాణ్ (ఏయన్నార్)ని లత (వాణిశ్రీ) అనే యువతి తన ప్రేమతో ఎలా సన్మార్గుడిలా మలిచింది? అనేదే చిత్ర కథాంశం.
* మూవీ మొఘల్ డి. రామానాయుడు కెరీర్ లో `ప్రేమనగర్`కి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. `రాముడు - భీముడు` (1964) వంటి విజయవంతమైన చిత్రంతో సోలో ప్రొడ్యూసర్ గా తొలి అడుగేసినా.. `ప్రేమనగర్`తోనే ఎనలేని గుర్తింపుని తెచ్చుకున్నారు రామానాయుడు. అంతేకాదు.. ఈ చిత్రాన్ని తమిళంలో `వసంత మాళిగై`(1972), హిందీలో `ప్రేమ్ నగర్`(1974) పేర్లతో పునర్నిర్మించి ఆయా చోట్ల కూడా ఘనవిజయాలు చూశారు. మూడు వెర్షన్స్ కి కూడా కె.ఎస్. ప్రకాశరావునే దర్శకత్వం వహించడం విశేషం.
* ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్.. బాలనటుడిగా సందడి చేశారు. చిన్నప్పటి సత్యనారాయణ పాత్రలో వెంకీ దర్శనమిచ్చారు.
* పదికి పైగా పాటలున్న `ప్రేమనగర్`లో ప్రతీ గీతం ఓ ఆణిముత్యమే. మరీముఖ్యంగా.. ``ఎవరి కోసం``, ``మనసు గతి ఇంతే``, ``తేట తేట తెలుగులా``, ``నీ కోసం వెలసింది``, ``కడవెత్తుకొచ్చింది``, ``నేను పుట్టాను``, `` లే లే లే లే నా రాజా``, `` ఉంటే ఈ ఊళ్ళో ఉండు`` విశేషాదరణ పొందాయి.