సినిమా పేరు: శ్రీకారం
తారాగణం: శర్వానంద్, ప్రియాంక అరుళ్ల మోహన్, రావ్ రమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
మ్యూజిక్: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఆర్ట్: అవినాష్ కొల్లా
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
డైరెక్టర్: కిశోర్ బి.
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
విడుదల తేదీ: 11 మార్చి 2021
రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదనే పాయింట్తో తీసిన సినిమాగా ఇప్పటికే బాగా ప్రచారం పొందిన సినిమా 'శ్రీకారం'. "బలేగుంది బాలా", "సందళ్లె సందళ్లే" పాటలు బాగా పాపులర్ అవడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. శర్వానంద్ హీరోగా కిశోర్ బి. అనే కొత్త దర్శకుడు తీసిన 'శ్రీకారం' ఎట్లుందంటే...
కథ
కార్తీక్ (శర్వానంద్) హైదరాబాద్లో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంటాడు. అతని తండ్రి కేశవులు (రావు రమేశ్) చిత్తూరు జిల్లాలోని అనంతరాజపురంలో ఓ రైతు. భూస్వామి ఏకాంబరం (సాయికుమార్) దగ్గర తండ్రి చేసిన అప్పును అతను చెల్లిస్తాడు. ఊళ్లోవాళ్లు చాలా మంది తమ భూముల్ని తాకట్టు పెట్టి సిటీకి వలస వెళ్లి దినసరి కూలీలుగా మారిపోతున్నారని తెలుసుకున్న కార్తీక్ తన ఉద్యోగాన్ని వదిలేసి, ఊరికి వెళ్తాడు. రైతు అవుతాననే అతడి కోరికను తండ్రి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. కానీ కార్తీక్ మట్టినే నమ్ముకుంటానంటాడు. ఊరివాళ్లకు ఉమ్మడి వ్యవసాయం అనే కాన్సెప్ట్ను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది క్లైమాక్స్.
రైతు గొప్పతనం ఏమిటో చెప్పడానికి దర్శకుడు కిశోర్ 'శ్రీకారం'తో ప్రయత్నించాడు. ఈ సినిమా చూస్తుంటే మనకు 'మహర్షి', 'భీష్మ', 'శ్రీమంతుడు' సినిమాలు గుర్తుకువస్తే, అది మన తప్పు కాదు. ఉమ్మడి వ్యవసాయంపై వచ్చే ఆదాయం విషయంలో గ్రామస్తుల్లో భూస్వామి విభేదాలు సృష్టించే సీన్లను ఎఫెక్టివ్గా తీశాడు దర్శకుడు. కథనం ఒకింత ఆసక్తికరంగా ఉందంటే, దానికి కారణం.. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్. చాలా సన్నివేశాలను తన డైలాగ్స్తో రక్తి కట్టించాడు సాయిమాధవ్. బీడు భూమిని ఆకుపచ్చ తివాచీ పరుచుకున్నట్లుగా మార్చడానికి హీరో ఉపయోగించే టెక్నాలజీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే ఆ సీన్లు మనకు కొత్తకాదు, ఈ కథా కొత్త కాదు.
'మహర్షి'లో కానీ, అంతకు ముందు 'శ్రీమంతుడు'లో కానీ మహేశ్ విలాసవంతమైన జీవనశైలిని వదిలేసి ఊళ్లలోకీ, పొలాల్లోకీ వెళ్లి కష్టపడ్డం చూశాం. ఆ సినిమాలకూ, 'శ్రీకారం'కూ తేడా కరోనా. అవును. కార్తీక్ బృందం తాము పండించిన పంటను ఎంతో ఆనందంతో ఒక ట్రక్కులోకి ఎక్కించి, దాన్ని అమ్మకానికి పంపాలకొనేంతలో, కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో, దానిలోనే ఉండిపోయి కుళ్లిపోతాయి.
ప్రియాంకా అరుళ్మోహన్ చేసిన హీరోయిన్ చైత్ర పాత్రకు కథలో పెద్ద ప్రాముఖ్యం లభించలేదు. హీరో వెంటపడి, అతడిపై ప్రేమను వ్యక్తం చేయడానికే ఆమె పాత్ర పనికొచ్చింది. కాదనడానికి కార్తీక్కు.. నో ఛాన్స్. పెంచల్ దాస్ రాసిన "భలేగుంది బాలా" పాట తెరపై శర్వానంద్ పాడుతుంటే చాలా కొత్తగా అనిపించింది. అది ఆకట్టుకుంటుంది. డైలాగ్స్తో పాటు మిక్కీ జె. మేయర్ మ్యూజిక్, యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎమోషన్స్ కొంతవరకు పండాయి. ఎడిటింగ్ క్రిస్ప్గా ఉంటే బాగుండుననిపిస్తుంది.
చివరలో వ్యవసాయం ప్రయోజనాల గురించి కార్తీక్ ఉపన్యాసం ఇస్తుంటే, '1.. నేనొక్కడినే' మూవీలో మహేశ్ ప్రసంగం గుర్తుకు వచ్చింది. వ్యవసాయాన్ని ఎట్లా కెరీర్గా మలచుకోవచ్చో నిరూపించడం 'శ్రీకారం' ఉద్దేశం. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల అభినయం
సాధారణంగా తను చేసిన పాత్రలో ఫెయిల్ కాని శర్వానంద్ మరోసారి 'శ్రీకారం'లోని కార్తీక్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మంచి పర్ఫెర్మెన్స్ ఇచ్చాడు. కేశవులు పాత్రలో రావు రమేశ్ ఎప్పట్లా సూపర్బ్ అనిపించే అభినయాన్ని ప్రదర్శించారు. ఆయన డైలాగ్ డిక్షన్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏకాంబరం పాత్రలో సాయికుమార్ సరిపోయాడు కానీ, ఆయన పాత్రను ఇంకా ఎఫెక్టివ్గా మలచి ఉండొచ్చనిపిస్తుంది. ప్రియాంకా మోహన్ అందంగా ఉంది కానీ, నటించడానికి అవకాశం లేని పాత్ర ఆమెది. 'శతమానం భవతి'లో మాదిరిగానే సీనియర్ నరేశ్కు మంచి పాత్ర లభించింది. సునాయాసంగా చేసుకుపోయాడు. కార్తీక్ తల్లిగా ఆమని ఓకే. సత్య నవ్వించాడు. మురళీశర్మ, సప్తగిరి పాత్రల పరిధి మేరకు నటించారు.
మంచి ప్రయోజనాత్మక కథను సాధారణ స్క్రీన్ప్లేతో తీసిన సాధారణ చిత్రం 'శ్రీకారం'. ఒక్కసారి చూడొచ్చు.
- బుద్ధి యజ్ఞమూర్తి