Home » Movie Reviews » అర్జున ఫల్గుణ



Facebook Twitter Google


సినిమా పేరు: అర్జున ఫల్గుణ
తారాగ‌ణం: శ్రీ విష్ణు, అమృత అయ్యర్, నరేష్, సుబ్బరాజు, రంగస్థలం మహేష్, దేవీ ప్రసాద్ 
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం
సినిమాటోగ్రఫర్: జగదీష్
నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం: తేజ మర్నీ
బ్యానర్: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుద‌ల తేదీ: 31 డిసెంబ‌ర్ 2021

ఈ ఏడాది ఇప్పటికే 'గాలి సంపత్', 'రాజ రాజ చోర' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన శ్రీ విష్ణు ఏడాది చివరి రోజున 'అర్జున ఫల్గుణ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'జోహార్' ఫేమ్ తేజ మర్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మరి 'అర్జున ఫల్గుణ'తో శ్రీ విష్ణు మెప్పించాడో లేదో రివ్యూ చదివి తెలుసుకుందాం.

కథ:- గోదావరి ప్రాంతంలోని ఒక పల్లెటూరిలో అర్జున్(శ్రీ విష్ణు), శ్రావణి(అమృతా అయ్యర్), రాంబాబు, తాడి, ఆస్కార్ చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. డిగ్రీ పూర్తి చేసిన ఈ ఐదుగురు అందరిలా ఉద్యోగాల కోసం సిటీ బాట పట్టకుండా ఊరిలోనే ఉంటూ కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. అలా సరదాగా సాగిపోతున్న వీరి జీవితాలను ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతాయి. 

తాడి(రంగస్థలం మహేష్) తండ్రి(దేవీప్రసాద్) బ్యాంకు నుంచి వ్యవసాయం కోసం అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తీర్చలేకపోవడంతో వారి ఇంటిని జప్తు చేయడానికి బ్యాంక్ అధికారులు వస్తారు. ఆ సమయంలో కర్ణం(నరేష్) బ్యాంక్ వారితో మాట్లాడి ఇప్పుడు రూ.50 వేలు కట్టి, మిగతా డబ్బులు వారం రోజుల్లో కట్టించేలా ఒప్పిస్తాడు. అయితే అప్పటికప్పుడు కట్టడానికి 50 వేలు కూడా లేకపోవడంతో.. ఫ్రెండ్ కోసం శ్రీ విష్ణు తను ఎంతో ఇష్టంగా సొంతచెల్లిలా చూసుకుంటున్న ఆవుని కర్ణం దగ్గర తాకట్టు పెడతాడు. 

తాడి ఇల్లు జప్తు కాకుండా ఉండాలన్నా, శ్రీ విష్ణు ఆవు తిరిగి రావాలన్నా వారికి రూ.4 లక్షలకు పైగా అవసరం. ఆ డబ్బు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారికి.. పోలీసులకు చిక్కకుండా అరకు నుంచి గంజాయి మూట తీసుకొస్తే రూ.4 లక్షలు ఇస్తానంటూ తెలిసిన వ్యక్తి ఆఫర్ ఇస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డీల్ కి ఒప్పుకున్న ఆ ఐదుగురి జీవితాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. ఆ ఐదుగురు పోలీసుల కంటపడకుండా ఆ మూట తెచ్చారా? వారి ప్రాబ్లెమ్స్ సాల్వ్ అయ్యాయా? అనేది మిగతా కథ.



ఎనాలసిస్ :

కథ, కథనం బాగుంటేనే సినిమా బాగుంటుంది. కానీ ఈ సినిమాలో అవే లోపించాయి. సాధారణ కథని, అతి సాధారణ కథనంతో నడిపించి ప్రేక్షకులను మెప్పిస్తానని డైరెక్టర్ తేజ మర్నీ ఎలా అనుకున్నాడో అర్థం కావట్లేదు. బ్యాంక్ లోన్ లు, రైతుల ఆత్మహత్యల సన్నివేశాలు పలు సినిమాల్లో మనం చూసున్నాం. వాటిని ప్రేక్షకులకు ఏ మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ కాకుండా మరింత రొటీన్ గా తెరకెక్కించాడు దర్శకుడు.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ తో గానీ, ఎమోషన్ సీన్స్ తో గానీ ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేరు. ఆంధ్రప్రదేశ్ లోని మద్యం బ్రాండ్లు అయిన బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పై వచ్చే సెటైరికల్ డైలాగ్స్ కొందరికి కనెక్ట్ కావచ్చేమో. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని కూడా సరిగా డిజైన్ చేయలేదు దర్శకుడు. హీరో హీరోయిన్ కాబట్టి వాళ్ళు లవ్ లో ఉన్నారని ప్రేక్షకులు అనుకోవడమే తప్ప.. వాళ్ళ ప్రేమకి సంబంధించిన సన్నివేశాలే లేవు. ఒకట్రెండు ఉన్నా అవి కనెక్ట్ కావు. ఇలా ఏ మాత్రం కనెక్ట్ కానీ సీన్స్ తో ఇంటర్వెల్ ఎప్పుడొస్తుందా అన్నట్లుగా ఫస్ట్ హాఫ్ సాగింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమాలో కాస్త వేగం వస్తుంది. అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో తాడి ఊరిని వదిలి వెళ్లిపోయే సీన్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఇలా ఒకటి అరా తప్ప సినిమాలు బలమైన సన్నివేశాలే కరువయ్యాయి.

అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించే ఐదుగురూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా కనిపిస్తారని మూవీ విడుదలకు ముందే చెప్పడంతో ఈ సినిమాపై తారక్ అభిమానుల్లో కూడా కాస్త ఆసక్తి నెలకొంది. చిన్నప్పుడు నోట్ బుక్ లో ఎన్టీఆర్ ఫోటోలు అతికించడం, పెద్దయ్యాక ఎన్టీఆర్ కటౌట్ ముందు డ్యాన్స్ వేయడం, గంజాయి మూట తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ అని పేర్లు మార్చి చెప్పడం తప్ప.. ఎన్టీఆర్ అభిమానులు అంతగా కనెక్ట్ అయ్యే సీన్స్ కూడా లేవు.

ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం మ్యూజిక్, జగదీష్ సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. టెక్నికల్ గా అంతో ఇంతో బాగున్నా అసలు సినిమాకి ప్రాణమైన కథ, కథనమే లేనప్పుడు ఇక సినిమా ప్రేక్షుకులను ఏం ఆకట్టుకుంటుంది?.

న‌టీన‌టుల ప‌నితీరు:- శ్రీ విష్ణు మొదటి నుండి నేచురల్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తనకి బాగా అలవాటైన విలేజ్ లో ఉండే పక్కింటి కుర్రాడి లాంటి పాత్రని అవలీలగా చేశాడు. అయితే గోదావరి స్లాంగ్ తో మాట్లాడే కొన్ని సన్నివేషాల్లో మాత్రం విష్ణు నటన కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. ఓవరాల్ గా మాత్రం ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో మెప్పించాడు. పల్లెటూరి అమ్మాయి శ్రావణి పాత్రకి అమృత అయ్యర్ సరిగ్గా సరిపోయింది. ఇక 'రాజావారు రాణివారు' సినిమాతో మెప్పించి ఆ సినిమాలోని క్యారెక్టర్ పేరునే తన పేరుగా చేసుకున్న చౌదరి తన కామెడీ టైమింగ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గంజాయి కొట్టాక వచ్చే సన్నివేశాల్లో బాగా నవ్వించాడు. తాడి పాత్రలో మహేష్, పోలీస్ ఆఫీస్ రోల్ లో సుబ్బరాజు మెప్పించారు. నరేష్, దేవీప్రసాద్ ఎప్పటిలానే వాళ్ళకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

శ్రీ విష్ణు సినిమా అంటే ఎంతో కొంత విషయం ఉంటుందనేది తెలుగు సినీ ప్రేమికుల్లో ఉన్న అభిప్రాయం. దానికి తోడు జోహార్ సినిమాతో ఆకట్టుకున్న తేజ మర్నీ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో 'అర్జున ఫల్గుణ'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలతో సినిమాకి వెళ్తే నిరాశ చెందక తప్పదు.

-గంగసాని

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.