ఓటీటీలో హిందీ ఛత్రపతి!
on Jan 25, 2023
తెలుగులో ఒకనాడు భారీ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. 2014లో ఇతను వివి వినాయక దర్శకత్వంలో అల్లుడు శీను అనే చిత్రం చేశారు. ఈ చిత్రమే అతనికి మొదటి మూవీ. అప్పటినుంచి ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆయన చేసినవి కేవలం ఎనిమిది చిత్రాలు మాత్రమే. అల్లుడు శీను తో మొదలుపెట్టి స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ అనే చిత్రాల్లో నటించారు. కాగా ప్రస్తుతం ఆయన తెలుగు చత్రపతికి హిందీ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తన మొదటి చిత్రం దర్శకుడు వివి వినాయక్ దర్శకుడు కావడం విశేషం. దీంతో పాటు ఆయన స్టువర్ట్పురం దొంగ అనే చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. ఇక ఇతని ఛత్రపతి రీమేక్ బాలీవుడ్ లో ఎంతవరకు వచ్చిందో అర్థం కావడం లేదు.
ఈ సినిమాపై అప్డేట్స్ లేవు. సినిమా ప్రారంభమై చాలా కాలమైంది. దీంతో అసలు ఈ సినిమా ఉందా లేదా అని ప్రచారం జోరు అందుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుందని అంటున్నారు. కానీ విడుదల విషయంలో మాత్రం మీమాంస కొనసాగుతోంది. మొదట భారీ ఎత్తున ధియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ కావడంతో ఉత్తరాదిన భారీ ప్రమోషన్స్ చేయాలి. భారీ ఎత్తుగా థియేటర్లను సొంతం చేసుకోవాలి. ఉత్తరాదిన పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలంటే భారీగా ఖర్చవుతుంది. అందులోనూ సాయి శ్రీనివాస్ తొలి హిందీ చిత్రం కాబట్టి ఇంత చేసినా అక్కడ మంచి థియేటర్లో దొరుకుతాయా అనేది సందేహమే. సరైన రిలీజ్ డేట్ కూడా దొరక్కపోతే ఇబ్బంది ఎదురవుతుంది.
దాంతో దాదాపు ధియేటర్ రిలీజ్ అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం హిందీ సినిమాలు ఎక్కువగా ఓటీటీ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ కూడా ఓటీటీ రిలీజ్ అయితే పెద్దగా ఖర్చు ఉండదని అలా ప్లాన్ చేస్తోందట. బాలీవుడ్ చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. పెద్దగా ప్రచారానికి ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంతో చత్రపతి రీమేక్ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.