English | Telugu
మళ్లీ మనం కలుసుకునేదాకా.. నవ్వులు పంచుతూనే ఉంటాను నాన్నా!
Updated : May 24, 2021
బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఇటీవల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?' అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో బ్లాక్బస్టర్ కాకపోయినా బయ్యర్లకు నష్టాలైతే కలిగించలేదు. లేటెస్ట్గా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ప్రదీప్ ఎప్పటిలానే యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా ప్రదీప్ బయట ఎక్కడా కనిపించడం లేదు. ప్రదీప్ కుటుంబం కరోనాతో కుంగిపోయింది.
ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు (65) కరోనాతో పోరాడుతూ మే 1న మృతి చెందారు. అప్పటికి ప్రదీప్ సైతం కరోనా పాజిటివ్గా నిర్ధారణై క్వారంటైన్లో ఉన్నాడు. తండ్రితో అత్యంత సన్నిహితంగా మెలిగే ప్రదీప్కు అది తీవ్ర శరాఘాతం. ఆ బాధ నుండి ప్రదీప్ ఇంకా బయటకురాలేదు. మొదటిసారిగా ప్రదీప్ తన తండ్రి మరణంపై ఎమోషనల్గా స్పందించాడు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేసిన ఓ నోట్లో అతడు రాసిన మాటలు తండ్రిపై అతడి ప్రేమకు అద్దం పడతాయి. అందులో "మిమ్మల్ని కలుసుకొనేదాకా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, నవ్వులు పంచుతూనే ఉంటాను." అంటూ రాసిన మాటలు అందరి హృదయాల్నీ స్పృశిస్తున్నాయి. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''ఐ లవ్ యూ నాన్న, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా చిరునవ్వుతో ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఇక నుంచి నేనేం చేసినా మీకు గౌరవం కలిగించేలా పని చేస్తాను. మీ జీవితానికి ఒక అర్థం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా మీరు నా వెంటే నిలబడ్డారు. ముక్కలైన నా మనస్సును ఎన్నో సార్లు బాగు చేశారు. అలాగే నా కాళ్ల మీద నన్ను నిలబడేలా చేశారు. మీరు నాకు ఎప్పటికీ స్పెషల్. మీరు కోరుకున్నట్లుగానే నా జీవితంలో నేను జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్లకు నవ్వులు పంచుతూనే ఉంటాను.. మనం మళ్లీ కలుసుకునే దాకా.. మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాను నాన్న'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.